– లబ్దిదారులకు కేరళ సర్కారు తీపి కబురు
– 62 లక్షల మందికి ప్రయోజనం
తిరువనంతపురం : కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా అక్కడి సామాజిక, సంక్షేమ పథక లబ్దిదారులకు విజయన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లబ్దిదారులకు రెండు ఇన్స్టాల్మెంట్ల పింఛన్ను అందించనున్నది. ఈ మేరకు రూ.1679 కోట్లను మంజూరు చేసినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్ బాలగోపాల్ ప్రకటించారు. దీంతో ఓనమ్ పండుగ సందర్భంగా దాదాపు 62 లక్షల మంది లబ్దిదారులు రూ.3200 చొప్పున అందుకోనున్నారు. లబ్దిదారులకు ఆగస్టు పింఛన్తో పాటు అదనంగా ఇంకో ఇన్స్టాల్మెంట్ అందనున్నది. ప్రతిష్టాత్మక ఓనం పండుగ సమయంలో పెన్షనర్లకు ఆర్థిక సహాయాన్ని అందించటం కోసం కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. లబ్దిదారులకు ఈ నగదు శనివారం నుంచి అందనున్నది. 26.62 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు క్రెడిట్ కానున్నాయి. మిగతావారికి సహకార బ్యాంకుల ద్వారా వారి ఇంటికే పెన్షన్ చేరుతుంది. ఇక జాతీయ పెన్షన్ పథకం కింద 8.46 లక్షల మంది కోసం కేంద్రం తన షేర్ను కేటాయించాల్సి ఉన్నది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే రూ.48.42 కోట్లను మంజూరు చేసింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ పీఎంఎఫ్ఎస్ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ కానున్నది. కాగా కేరళ సర్కారు నిర్ణయంపై అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఓనమ్కు డబుల్ పింఛన్
- Advertisement -
- Advertisement -