నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల అగ్ని-5 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. తాజాగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తన అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రాన్ని చేర్చింది.శనివారం ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.
ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) అనేది ఒకే వ్యవస్థ కాదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బహుళస్థాయి రక్షణ వ్యవస్థ. ఇందులో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (క్యూఆర్శామ్), అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీషోరాడ్స్) క్షిపణులతో పాటు అధిక శక్తివంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) కూడా ఉన్నాయి.