నవతెలంగాణ-హైదరాబాద్: పాక్ ఉగ్రకుట్రలపై ప్రపంచదేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయ బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈక్రమంలో రష్యాకు వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని దౌత్య బృందానికి విచిత్ర అనుభవం ఎదురైంది.
భారత్ ఎంపీల బృందం ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయ్యే సమయానికి మాస్కోలో డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా మాస్కోలో దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే మాస్కో ఎయిర్ పోర్టు ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో భారత దౌత్య బృందం విమానం ల్యాండింగ్కు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ అంతరాయం కారణంగా విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. గంటల తరబడి అలా గాల్లోనే ఉన్న విమానం చివరికి సురక్షితంగా మాస్కో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు విమానాశ్రయంలో అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని స్వాగతించి.. వారిని సురక్షితంగా వారి హోటల్కు తీసుకెళ్లారు.