నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యం తాగినవారిని గుర్తించి పట్టుకోవాల్సిన ఏపీఎస్పీ పోలీసులే పూటుగా తాగారు.. అదే మత్తులో అడ్డువచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూ తిరుమల చేరుకున్నారు. అక్కడ బూతుపురాణం అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల కొండపై భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు బి.రాజశేఖర్, కె.ఓంకార్ నాయక్, షేక్ సిరాజుద్దీన్ తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్పీ ఉన్నతాధికారి వాహనాన్ని మరమ్మతులు చేయించి తీసుకొస్తామని చెప్పి తిరుపతి తెచ్చారు. ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. అనంతరం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు.
పోలీసు వాహనం కావడంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. ముగ్గురూ వాహనాన్ని అతివేగంగా నడిపి మత్తులో ఘాట్ రోడ్డులో ఓ వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం తిరుమల చేరుకుని రింగురోడ్డు మీదుగా డీ టైప్ క్వార్టర్స్ వద్ద వేగంగా వస్తూ డ్రైనేజీ కల్వర్టును ఢీకొన్నారు. దీంతో ముందు టైరు పేలిపోయింది. కారులో నుంచి దిగిన ముగ్గురిలో షేక్ సిరాజుద్దీన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. బి.రాజశేఖర్, కె.ఓంకార్ నాయక్లను పోలీస్స్టేషన్కు తరలించి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, సిరాజుద్దీన్ను సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ ఉత్తర్వులు జారీచేశారు.