Monday, June 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంస్టీల్‌ దిగుమతులపై సుంకాలు 50 శాతానికి పెంపు

స్టీల్‌ దిగుమతులపై సుంకాలు 50 శాతానికి పెంపు

- Advertisement -

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి
వాషింగ్టన్‌:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా స్టీల్‌ దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూఎస్‌ స్టీల్‌ పరిశ్రమను కాపాడేందుకు ఉక్కు దిగుమతులపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నామన్నారు. పెన్సిల్వేనియాలోని యూఎస్‌ స్టీల్‌, మోన్‌ వ్యాలీ వర్క్స్‌-ఇర్విన్‌ ప్లాంట్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ.. సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించడంతో పాటు, అమెరికన్‌ తయారీని గణనీయంగా పెంచనుందని పేర్కొన్నారు. దీని వల్ల యూఎస్‌ మరింత సురక్షితంగా ఉంటుందన్నారు. పెంచిన సుంకాలు జూన్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్‌ పేర్కొన్నారు.
ప్రతిపాదిత సుంకాల పెంపు అమల్లోకి వస్తే గృహ నిర్మాణం, ఆటోమోటివ్‌, నిర్మాణ రంగాలతో సహా ఉక్కుపై ఎక్కువగా ఆధారపడిన పరిశ్రమలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తగా ఉన్న ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు యూఎస్‌కు స్టీల్‌ ఎగుమతులు చేసే దేశాల్లో ఆందోళన నెలకొంది. ఉక్కుపై ఇప్పటికే పెంచిన సుంకాల ప్రభావం దక్షిణ కొరియా వంటి దేశాలపై కనిపిస్తోంది. మార్చి నెలలో అమెరికాకు సియోల్‌ నుంచి స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 19 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి 2024లో అమెరికా 26.2 మిలియన్‌ టన్నుల ఉక్కును దిగుమతి చేసుకుంది. యూరోపియన్‌ యూనియన్‌ను మినహాయించి ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు దిగుమతిదారుగా ఉంది. భారత్‌ నుంచి గతేడాది ఏప్రిల్‌ – నవంబర్‌లో అమెరికాకు 2.3 బిలియన్‌ డాలర్ల స్టీల్‌ ఎగుమతులు జరిగాయి. అల్యూమినియం ఉత్పత్తుల ఎగుమతి 516 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ట్రంప్‌ 2018లో తొలిసారి ఎన్నికైన సమయంలోనూ భారత స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచారు. తాజా టారిఫ్‌ల పెంపు భారత ఉక్కు పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపనుందో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -