నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషయం తెలిసిందే. లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. విమానంలో కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికితే కారణాలు తెలిసే అవకాశం ఉంది.
కానీ దానిక కన్నా ముందు దర్యాప్తు అధికారులు క్రాష్ అయిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ శకలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్(DVR)ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విమానం ప్రమాదానికి గురయ్యే ముందు ఫ్లైట్ లోపల రికార్డ్ అయిన పూర్తి ఫుటేజీ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ వీడియోలను అధికారులు రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా మరో కీలక పరికరం బ్లాక్ బాక్స్ కూడా దొరికితే.. ప్రమాదంపై అధికారులు పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.
బ్లాక్ బాక్స్ అనేది విమాన పనితీరు, పైలట్ల మధ్య సంభాషణలను రికార్డ్ చేసే ఒక పరికరం. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బాక్స్గా పరిగణిస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ఎంత ఎత్తులో ఉంది..? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది..?, ఫ్లైట్ కంట్రోల్స్ పనితీరును రికార్డ్ చేస్తుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, ఫ్లైట్ పాత్ డేటాతో సహా కీలకమైన టెక్నికల్ పెరామీటర్స్ని నమోదు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ల మధ్య సంభాషణలు, ఏటీసీ నుంచి వచ్చే ఆదేశాలు వంటి వాటిని సేకరిస్తుంది.
బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం సులువు అవుతుంది. సహజంగా బ్లాక్ బాక్సులు అత్యంత దృఢంగా ఉంటాయి. ఎలాంటి ప్రమాదానైనా తట్టుకుంటాయి. ప్రకాశవంతమైన నారింజ కలర్లో ఉండే ఈ బాక్స్ పేలుళ్లు, మంటలు, నీటి పీడనాన్ని, హై స్పీడ్ క్రాష్ లను తట్టుకుంటుంది. 25 గంటల సమాచారాన్ని నిల్వ చేస్తుంది.