నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలోని 334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు వేసింది. దేశంలో గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. వాటిని జాబితా నుంచి తొలగించింది. నిబంధనల మేరకు … ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ 334 పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ, వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520 కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం … ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి.