– ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్
ముంబయి: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలపై ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ ఇచ్చిన ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత సరైన ఆధారాలతోనే ఎన్నికల కమిషన్ను ప్రశ్నిస్తున్నారన్నారు. ఈవిషయాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఎంవీఏ) మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాహుల్ అడిగే ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పి తీరాలని అన్నారు. ఇండియా కూటమి నేతలకు రాహుల్ ఏర్పాటుచేసిన ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చివరి వరసలో కూర్చోవడాన్ని కూడా బీజేపీ వివాదంగా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజెంటేషన్ సమయంలో టీవీ స్క్రీన్ సరిగ్గా కనిపిస్తుందనే ఆలోచనతో తాను, ఫరూఖ్ అబ్దుల్లా, కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా వెనక వరుసలోనే కూర్చున్నామని అన్నారు. ఇందులో వివాదం చేసే విషయం ఏముందని ప్రశ్నించారు. మరోవైపు సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఇండియా బ్లాక్ నేతలు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదని వెల్లడించారు.
బీజేపీ కూటమితో కలిసే ప్రసక్తే లేదు
మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, ఠాక్రేల పేర్లకు ఉన్న ప్రాధాన్యం గురించి తెలిసిందే. ఇటీవల ఠాక్రే సోదరులు తిరిగి కలుసుకున్నట్లే.. ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత అజిత్ పవార్ తో చేతులు కలపనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ముంబయిలో పవార్ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమంలో ఇరువురు నేతలు కలిసి పాల్గొనడంతో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై శరద్ పవార్ స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు ప్రచారాలని తోసిపుచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కూటమికి తాను ఎప్పటికీ మద్దతివ్వనని స్పష్టం చేశారు.
రాహుల్ ఆరోపణలపై ఈసీ దర్యాప్తు చేయాలి
- Advertisement -
- Advertisement -