Saturday, June 21, 2025
E-PAPER
Homeజాతీయంవిస్తరణకు గ్రహణం

విస్తరణకు గ్రహణం

- Advertisement -

ప్రవేశాలు లేక వెలవెలబోతున్న మూడో తరం
ఐఐటీలు నియామకాలూ అంతంత మాత్రమే
వేధిస్తున్న సిబ్బంది కొరత
న్యూఢిల్లీ :
2015-2016లో ఏర్పాటు చేసిన మూడో తరం ఐఐటీలు ప్రస్తుతం అడ్మిషన్లు లేక వెలవెలపోతున్నాయి. ఉద్యోగ నియామకాలు కూడా సరిగా జరగడం లేదు. మాస్టర్స్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే తక్కువగానే విద్యార్థులు చేరుతున్నారు. కొన్ని ఐఐటీలు అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం పాలక్కడ్‌, భిలారు, జమ్ము, ధార్వాడ్‌, తిరుపతి, గోవాలో ఆరు కొత్త ఐఐటీలను ఏర్పాటు చేసింది. తాత్కాలిక క్యాంపస్‌లలో ఏర్పడిన ఈ ఐఐటీలలో మొదటి సంవత్సరం 180 మంది విద్యార్థులను చేర్చుకోవాలని భావించారు. విద్యార్థుల సంఖ్యలో రెండో ఏడాది 450కి, మూడో సంవత్సరానికి 928కి (840 మంది అండర్‌ గ్రాడ్యుయేట్లు సహా) పెంచాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు.
తగ్గిన ప్రవేశాలు
‘మొదటి దశలో భాగంగా 1,200 మంది విద్యార్థుల కోసం శాశ్వత క్యాంపస్‌ నిర్మించేందుకు 2017 నవంబరులో క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. కోవిడ్‌ కారణంగా విద్యార్థుల ప్రవేశ లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం జరిగింది. రెండో దశకు క్యాబినెట్‌ ఇటీవలే ఆమోదం తెలిపింది. 2029 నాటికి నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు మరో 1,300 మంది విద్యార్థులను చేర్చుకోవచ్చు. అన్ని ఐఐటీలలోనూ ఇదే పరిస్థితి’ అని తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ కె.ఎన్‌.సత్యనారాయణ తెలిపారు. ఐఐటీ ధార్వాడ్‌ విషయానికి వస్తే 2023-24లో 1,170 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు ఉంటారని అంచనా వేయగా ప్రస్తుతం క్యాంపస్‌లో 980 మంది మాత్రమే ఉన్నారు. ‘మౌలిక సదుపాయాలు సహా వివిధ పారామితులను దృష్టిలో పెట్టుకొని వార్షిక ప్రవేశాలను పెంచుతాము. నిర్మాణ ప్రాజెక్టులోని 1బీ దశ కింద మరింత విస్తరించాలని అనుకుంటున్నాము. ప్రస్తుతం సంస్థలో పురోగతి నిలకడగా ఉంది’ అని ఐఐటీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక ఐఐటీ భిలారు విషయానికి వస్తే 2023-24లో 1,170 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 756 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులే ఉన్నారు. 2017 నాటి అంచనా కంటే కూడా ఇది తక్కువే. ‘ది ప్రింట్‌’ పోర్టల్‌ అడిగిన ప్రశ్నకు ఐఐటీ భిలారు స్పందించలేదు. సమాధానమిచ్చేందుకు ఐఐటీ పాలక్కడ్‌ నిరాకరించింది. ఐఐటీ జమ్ము మాత్రం స్పందిస్తూ ‘మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, వనరుల లభ్యతను పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల ప్రవేశాలను పెంచుకుంటూ పోతాం’ అని తెలిపింది. ఐదు ఐఐటీలు తమ లక్ష్యాలను చేరుకోకపోయినప్పటికీ మే 7న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం మాత్రం విద్య, మౌలిక సదుపాయాల సామర్ధ్యాన్ని విస్తరించేందుకు అనుమతించింది. రాబోయే నాలుగు సంవత్సరాలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ ప్రోగ్రాములలో విద్యార్థుల సంఖ్యను 6,500కు పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
సవాళ్లతో సతమతం
గోవా ఐఐటీకి శాశ్వత క్యాంపస్‌ లేకపోవడంతో కేంద్రం దాని విస్తరణను పరిశీలనలోకి తీసుకోలేదు. ఏర్పాటు చేసిన నాలుగో సంవత్సరంలోనే శాశ్వత క్యాంపస్‌ నుండి పనిచేయాలని తొలుత ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే ఈ మూడో తరం ఐఐటీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఫ్యాకల్టీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ప్రాంగణ నియామకాలు సైతం తగ్గిపోతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు అన్ని ఐఐటీలలోనూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో సీట్లు ఖాళీగానే ఉండడం గమనార్హం. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో మాత్రం ఈ పరిస్థితి లేదు.
ప్రవేశాల పరిస్థితి
ఐఐటీ భిలారులో 2017-18, 2024-25 మధ్య 500 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు అందుబాటులో ఉండగా 274 మాత్రమే భర్తీ అయ్యాయి. 2018-19, 2024-25 మధ్య 510 పీహెచ్‌డీ సీట్లు అందుబాటులో ఉంటే 315 మాత్రమే భర్తీ అయ్యాయి. ఐఐటీ పాలక్కడ్‌లో 2019-20, 2024-25 మధ్య 452 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు అందుబాటులో ఉండగా 384 మాత్రమే భర్తీ అయ్యాయి.
2017-18, 2024-25 మధ్య 802 పీహెచ్‌డీ సీట్లు అందుబాటులో ఉంటే 579 మాత్రమే భర్తీ అయ్యాయి. ఐఐటీ తిరుపతి విషయానికి వస్తే 2018-19, 2024-25 మధ్య 713 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు అందుబాటులో ఉండగా 534 మాత్రమే భర్తీ అయ్యాయి. 2017-18, 2024-25 మధ్య 542 పీహెచ్‌డీ సీట్లు అందుబాటులో ఉంటే 413 మాత్రమే భర్తీ అయ్యాయి. దీనిపై ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ స్పందిస్తూ దేశవ్యాప్తంగా అన్ని సంస్థలలోనూ ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గిందని, ఫలితంగా నాణ్యమైన అభ్యర్థులు కరువయ్యారని చెప్పారు. ఐఐటీ ధార్వాడ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు 2022లో ప్రారంభమయ్యాయి. 2022-23, 2024-25 మధ్యకాలంలో 152 సీట్లు ఉండగా 102 మాత్రమే నిండాయి.
నియామకాలూ అంతంతే
ఇక ప్రాంగణ నియామకాల విషయానికి వస్తే నూతన ఐఐటీలలో వాటి సంఖ్య పడిపోయిందని డేటా చెబుతోంది. పాలక్కడ్‌ ఐఐటీలో 2024-25లో 68.83 శాతం నియామకాలు మాత్రమే జరిగాయి. తిరుపతిలో బీటెక్‌ ఉత్తీర్ణుల నియామకాలు 71.86 శాతానికి పడిపోయాయి. 2021-22, 2023-24 మధ్యకాలంలో ఈ ఐదు ఐఐటీలు సహా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలలో ప్రాంగణ నియామకాలు అసాధారణ రీతిలో తగ్గిపోయాయని పార్లమెంటరీ కమిటీ మార్చిలో వేలెత్తి చూపింది. 2023-24లో జమ్మూ ఐఐటీలో 70.25 శాతం, ధార్వాడ్‌లో 65.56 శాతం, భిలారులో 72.22 శాతం క్యాంపస్‌ నియామకాలు మాత్రమే జరిగాయని ఆ కమిటీ తెలిపింది. కొన్ని సందర్భాలలో ఎంపిక చేసిన విద్యార్థులకు ఇవ్వజూపిన వేతనం కూడా తక్కువగానే ఉంది. భిలారు ఐఐటీలో 2021-22లో ఎంపికైన విద్యార్థులకు సగటున రూ.14.12 లక్షల వార్షిక వేతనం లభిస్తే 2023-24 నాటికి అది రూ.12.51 లక్షలకు తగ్గిపోయింది.
కారణాలు ఇవే
రిజర్వ్‌డ్‌ కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడమే మాస్టర్స్‌ స్థాయితో సీట్లు ఖాళీగా ఉండడానికి కారణమని తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులు యూజీ సర్టిఫికెట్‌తోనో లేదా గేట్‌ స్కోరు ఆధారంగానో ఉద్యోగాలు పొందుతుండడంతో పీజీ వైపు దృష్టి సారించడం లేదు. అయితే ఐఐటీ జమ్మూలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో సీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. కొన్ని కొత్త విద్యా సంస్థలలో ఫ్యాకల్టీ పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. ఉదాహరణకు ఐఐటీ తిరుపతిలో 2024-25లో 14.3 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జమ్మూలో 2023-24లో 30 శాతం టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక విద్యా సంస్థలలో దాఖలు చేసిన పేటెంట్లకు, మంజూరైన పేటెంట్లకు మధ్య చాలా వ్యత్యాసం కన్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -