నవతెలంగాణ-హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటి ఆస్పత్రి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింది. ఈ కేసులో ఉన్న కీలక అంశాలపై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలిగా తేలింది. మొత్తం 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరోగసి పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం కూడా చేసినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది.
అయితే, విచారణలో భాగంగా సుమారు 40 కోట్ల రూపాయల మేరకు హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.