నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఇజ్రాయిల్ పార్లమెంట్ ద్వారా వివాదాస్పద బిల్లు పాస్ చేసింది. పాలస్తీనా ఖైదీలకు ఉరిశిక్షను ఆమోదిస్తూ ఏకపక్షం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు పార్లమెంటులో 62 అనుకూల ఓట్లు పడగా.. దీన్ని 48 మంది పార్లమెంటు సభ్యులు వ్యతిరేకించారు. ఈ చట్టాన్ని అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. ఇది ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో వర్ణ వివక్షలాంటి న్యాయ వ్యవస్థను పటిష్టం చేసే ప్రమాదం ఉందని, ఇప్పటికే ఉన్న ఘర్షణల్ని మరింత తీవ్రతరం చేస్తుందని విమర్శకులు హెచ్చరించారు. తాజాగా ఇజ్రాయిల్ నిర్ణయాన్ని ఎనిమిది ముస్లిం దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇస్లామాబాద్ వేదికగా గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు, ఇండొనేషియా, జొర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలు ఇజ్రాయిల్ ఆమోదించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. గురువారం ఇస్లామాబాద్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం, “రోజురోజుకూ పెరుగుతున్న వివక్షాపూరితమైన, తీవ్రమవుతున్న ఇజ్రాయెల్ పద్ధతులు వర్ణవివక్ష వ్యవస్థను పాతుకుపోయేలా చేస్తున్నాయని మండిపడ్డాయి. వారి పట్ల జరుగుతున్న హింస, అవమానకరమైన ప్రవర్తన పాలస్తీనా ఖైదీల పరిస్థితులపై ఆ ఎనిమిది దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.



