నవతెలంగాణ – హైదరాబాద్: వధూవరుల నూతన జీవితం ప్రారంభం కావాల్సిన వేళ, ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని చీకట్లు నింపింది. నేపాల్లోని బైతాడి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా, బైతాడి జిల్లాలోని పుర్చౌడి మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సుమారు 60 మందితో వెళ్తున్న ఈ బస్సు కొండ ప్రాంతంలోని వంకర మార్గంలో ప్రయాణిస్తూ నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 45 మందికి పైగా గాయపడగా, వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, వధూవరులు వేరే వాహనంలో ప్రయాణిస్తుండటంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నేపాల్ సైన్యం, పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.



