నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
బిహార్లో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ చివరిరోజు అగ్రనేతలు రంగంలోకి దిగారు. కూటమి తరుఫున సభలు,రోడ్షోలు, సమావేశాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలతో కూడిన మహాగట్ బంధన్(మహా కూటమి)తరుఫున రాహుల్గాంధీ ఎన్నికలు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కిషన్గంజ్, అమోర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చుట్టేశారు.
ఈనెల 6న మొదటి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 64శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల ఆధికారులు వెల్లడించారు. బీహార్ రెండో దశ ఎన్నికలతో పాటు మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్ లోని బుడ్గాం, నగరోటా, అంటా(రాజస్థాన్), ఘాట్శీల(జార్ఖండ్), జూబ్లీహీల్స్(తెలంగాణ), టార్న్ తరణ్(పంజాబ్), డంపా(మిజోరం), నువాపాడ(ఒడిసా) అసెంబ్లీ స్థానాలకు బైఎలక్షన్స్ జరగనున్నాయి.



