నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర ఎన్నికల రిగ్గింగ్ కథనంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఎన్నికల సంఘం (ఈసీ ) మంగళవారం లేఖ రాసింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం, నిబంధనల ప్రకారం అన్ని ఎన్నికలు జరుగుతాయని ఈసీ పేర్కొంది. రాజకీయ పార్టీలు నియమించిన బూత్స్థాయి ఏజెంట్లతో సహా మొత్తం ఎన్నికల కసరత్తులో వేలాది మంది సిబ్బంది పాల్గొంటారని కూడా స్పష్టం చేసింది.
2024 మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని జూన్ 12న ఒక ప్రముఖ దినపత్రిక కథనంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ కథనానికి ప్రతిస్పందనగా.. ఈసీ మంగళవారం అధికారికంగా ఇ-మెయిల్ పంపింది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం ఎన్నికల ప్రక్రియ వికేంద్రీకృత పద్ధతిలో జరుగుతుందని, 1,00,186మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఒ), 288 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఇఆర్ఒ), 139 మంది జనరల్ అబ్జర్వర్లు, 41మంది పోలీస్ అబ్జర్వర్లు, 71మంది వ్యయ పరిశీలకులు, ఈసీ నియమించిన 288 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్ఒఎస్) పాల్గన్నారని పేర్కొంది.
మహారాష్ట్ర వ్యాప్తంగా 1,08,026మంది బూత్ స్థాయి ఏజెంట్లను (బిఎల్ఎ) జాతీయ, రాష్ట్ర రాజకీయపార్టీలు నియమిస్తాయి. వారిలో కాంగ్రెస్ నియమించిన 28,421మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా ఉన్నారని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఇప్పటికే లేవనెత్తివుంటారని భావిస్తున్నామని పేర్కొంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు మాకు లేఖ రాయవచ్చని, అన్ని సమస్యలను చర్చించేందుకు పరస్పరం అనుకూలమైన తేదీ మరియు సమయంలో వ్యక్తిగతంగా కలవడానికి కమిషన్ కూడా సిద్ధంగా ఉంటుందని ఇసి పేర్కొంది.