నవతెలంగాణ-హైదరాబాద్: కోలీవుడ్ సినీనటుడు రవి మోహన్ (జయం రవి) కి సంబంధించిన కారు, ఇల్లును వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఈఎంఐలు ఆయన చెల్లించికపోవడంతో రవి ఇల్లు, ఆఫీస్ వద్ద అధికారులు నోటీసులు అంటించారు. అందుకు సంబంధించిన వార్త కోలీవుడ్లో వైరల్ అవుతుంది. భార్య ఆర్తితో జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. సుమారు ఏడాది నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కేసు కోర్టులో ఉండగానే రవి తన స్నేహితురాలు, గాయని కెనీషాతో ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రవి మోహన్ సుమారు మూడేళ్ల క్రితం చెన్నై తూర్పు తీర రోడ్డులో ఒక బంగ్లా కొన్నారు. కొంతకాలం పాటు తన భార్య ఆర్తి, పిల్లలతోనే అక్కడ నివసించారు. అయితే, కుటుంబ విభేదాల వల్ల ఆ ఇంటి నుంచి రవి మోహన్ బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆ ఇంట్లో పిల్లలతో ఆర్తి మాత్రమే నివసిస్తున్నారు.
ఈ పరిస్థితిలో, రవి మోహన్ గత 10 నెలలుగా తన ఇంటి కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐ మొత్తాన్ని చెల్లించలేదని తెలుస్తోంది. రూ.7.64 కోట్ల లోన్ మొత్తాన్ని చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. తేనాంపేటలోని సెమేయర్స్ రోడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని రవి మోహన్ స్టూడియోలో కూడా నోటీసులు అతికించారు. రుణం తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో అధికారులు పేర్కొన్నారు. తదనంతరం, తేనాంపేటలోని కెమియర్స్ రోడ్డులోని రవి మోహన్ స్టూడియోస్ కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగులు అతికించిన నోటీసును కార్యాలయ సిబ్బంది వెంటనే చించివేయడంతో గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించి సినీనటుడు రవి మోహన్ సరైన వివరణ ఇస్తారని వార్తలు వచ్చాయి.
ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. బ్యాంకు అధికారులు ఇల్లు వేలం వేస్తే ఆర్తి తన పిల్లలతో ఎక్కడ ఉంటుందనేది ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆడపిల్లకు సొంతంగా ఇల్లు లేదు తెలుసా..? అంటూ ఒక యంగ్ రచయిత చెప్పిన మాటలను కోట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లకు ఇలాంటి సందర్భం ఎదురైతే ఆమె చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. తాళి కట్టిన భార్యకు ఇల్లు లేకుండా రోడ్డు మీదకు తెచ్చేలా జయం రవి చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.