నవతెలంగాణ – హైదరాబాద్: దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థానీ గూఢచారికి చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. నిందితుడు రవీంద్ర వర్మ (27), యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన కీలక వివరాలను, స్కెచ్లు, డయాగ్రమ్లు, ఆడియో నోట్స్ రూపంలో పాక్ ఏజెంట్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా భారత్, విదేశాల్లోని పలు బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, థానే సమీపంలోని కల్వాలో నివసించే రవీంద్ర వర్మ, ఓ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగరీత్యా దక్షిణ ముంబైలోని నేవల్ డాక్యార్డ్కు వెళ్లే అవకాశం అతనికి ఉండేది. ఈ క్రమంలోనే యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లోకి కూడా ప్రవేశించేవాడు. నేవల్ డాక్యార్డ్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించకపోవడంతో, అక్కడ పని ముగించుకుని బయటకు వచ్చాక, రహస్య సమాచారాన్ని స్కెచ్లు, డయాగ్రమ్లు లేదా ఆడియో నోట్స్ రూపంలో పాక్ ఏజెంట్కు చేరవేసేవాడని ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు.
2024 నవంబర్ నుండి రవీంద్ర వర్మ పాకిస్థానీ ఏజెంట్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. 2024లో ‘పాయల్ శర్మ’, ‘ఇస్ప్రీత్’ పేర్లతో ఉన్న ఫేస్బుక్ ఖాతాల నుండి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్లను వర్మ అంగీకరించాడు. మహిళలుగా పరిచయం చేసుకున్న ఈ ఏజెంట్లు, తాము భారతదేశంలో ఓ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నామని, అందుకోసం యుద్ధనౌకల సమాచారం అవసరమని నమ్మబలికారు. కొద్దిరోజుల సంభాషణల తర్వాత, వర్మను హనీట్రాప్లో దింపి, కీలక భద్రతా సంస్థాపనల గురించి సున్నితమైన సమాచారాన్ని రాబట్టడం మొదలుపెట్టారు.
తాను ఎవరికి, ఎలాంటి సమాచారం అందిస్తున్నాడో వర్మకు పూర్తిగా తెలుసని, అందుకు ప్రతిఫలంగానే డబ్బులు తీసుకుంటున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడైన వర్మను కోర్టు సోమవారం వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఏటీఎస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.