– రైతులను వెంటనే విడుదల చేయాలి
నవతెలంగాణ – హైదరాబాద్: గద్వాల జిల్లా రాజోలిమండలం పెద్దదన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న 60 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి, 12 మందిని రిమాండ్కు పంపడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ కంపెనీ నిర్మాణానికి తీసుకున్న భూమికి సమీపంలో ప్రభుత్వం దళితులకిచ్చిన భూములు మరియు ఇంటి స్థలాలు ఉండడం వల్ల వివిధ రకాల కాలుష్యం ఏర్పడుతందని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. గ్రామసభల తీర్మానం, గ్రామపంచాయితీ అనుమతి లేకపోయినా కంపెనీ యాజమాన్యం జేసీబీలు, టిప్పర్లు, కంటైనర్లతో పాటు, బయటినుండి కూలీలను తెచ్చి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీన్ని వ్యతిరేకించిన రైతులపై, మహిళలు, ప్రజలపై పోలీసులు లాఠీఛార్జీచేసింది. స్ధానికంగా రైతుల, ప్రజల ఆమోదం లేకుండా, వారి అనుమతి లేకుండా పరిశ్రమను ఏర్పాటు చేయడం సరైంది కాదు. ఎన్నికల సమయంలో ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేయబోమని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. తక్షణమే రిమాండ్ చేసిన వారిని విడుదల చేసి, అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ ఎత్తివేసి, ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
రెవెన్యూ సదస్సులను శాంతియుతంగా జరపాలి
యేళ్ళ తరబడి అధికారుల చుట్టూ తిరిగినా తమ భూసమస్యలు పరిష్కారం కాకపోవడంతో చలామంది రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ రెవెన్యూ సదస్సులో తమ సమస్య చెప్పడానికి వచ్చిన వృద్దరైతు అల్లెపు వెంకటిని మెడపట్టి గెంటేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరిపి, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) కోరుతున్నది.