Sunday, June 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతిండి గింజలపై ఇథనాల్‌ పిడుగు

తిండి గింజలపై ఇథనాల్‌ పిడుగు

- Advertisement -

– ఇథనాల్‌ ఉత్పత్తి ఆదాయ వ్యయ పట్టిక (నిటి ఆయోగ్‌ అంచనా)
– జీఎస్టీ తగ్గింపు
– ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు
– రాష్ట్రాలతో సంబంధం లేకుండా నేరుగా అనుమతులు
– ‘ఇ 20’ లక్ష్యంగా ‘నేషనల్‌ బయో ఫ్యూయల్‌ పాలసీ’ ప్రకటించిన కేంద్రం
– డిమాండ్‌ పెరిగితే ఆహార సంక్షోభమే
– భవిష్యత్‌లో ప్రజలపై తీవ్ర ప్రభావం
– హెచ్చరించిన ఎఫ్‌ఏఓ 2023 నివేదిక
విదేశాలపై ఆధారపడకుండా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ‘నేషనల్‌ బయో ఫ్యూయల్‌ పాలసీ’ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇథనాల్‌ బ్లెండింగ్‌ పెట్రోల్‌ (ఈబీపీ) కోసం చెరుకుతో పాటు ఇతర పంటలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నలతో ఇథనాల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ‘ఈ 20’ పేరుతో నిటి ఆయోగ్‌, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రోడ్‌ మ్యాప్‌ను రూపొందించాయి. 2025-26 కల్లా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడమే రోడ్‌ మ్యాప్‌ లక్ష్యం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్‌లో దేశంలో ఆహార సంక్షోభానికి దారి తీసే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఊరగొండ మల్లేశం

ఇథనాల్‌ ఉత్పత్తి వల్ల ఆహార భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. డిమాండ్‌ పెరిగేకొద్దీ, బియ్యం, మొక్కజొన్న, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు ఇంధనం కోసం పెద్ద మొత్తంలో మళ్లించబడతాయి. ఎఫ్‌సీఐ బియ్యం, మొక్కజొన్నలను ఉపయోగించడం వల్ల మిగులు నిల్వలు తగ్గుతాయి. కొరత సమయంలో ఆహార ధరలను స్థిరీకరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అందువల్ల బయో ఇంధన విస్తరణ ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తుందనీ, అందువల్ల పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (ఎఫ్‌ఏసీ) 2023 నివేదిక హెచ్చరించింది. ఇథనాల్‌కు అధిక మొక్కజొన్న కేటాయింపు పౌల్ట్రీ, పశువుల మేతతో పాటు మానవ వినియోగాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా తమకు లబ్ది చేకూరుతుందనే కోణంలో మొక్కజొన్న, బియ్యం ఇతర ఇథనాల్‌ ఆధారిత పంటల వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫలితంగా కూరగాయలు, పప్పులు, నూనెలు ఇతర నిత్యావసర పంటల ఉత్పత్తి తగ్గి, ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు మనుషుల ఆహార భద్రతకు పెను సవాల్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే భారతదేశంలో పోషకాహార లోపం ఒక సవాలుగా ఉన్న నేపథ్యంలో శక్తి కోసం తినదగిన ధాన్యాలను పెట్రో ఉత్పత్తిలో ఉపయోగిం చడం నైతికంగా ప్రభుత్వాలకు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నేపథ్యం…
దేశంలో 2003 నుంచి ఆటోమోటివ్‌ ఇంధనంగా ఇథనాల్‌ వాడకాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో తొమ్మిది ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 శాతం ఇథనాల్‌ను తప్పనిసరిగా కలపాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌ 2002లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత కాలంలో దీని శాతాన్ని మరింతగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 2022 కల్లా 10 శాతంగా నిర్ణయించిన లక్ష్యాన్ని దేశం అధిగమించింది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 6న ప్రధాని బెంగళూర్‌లో ‘ఈ 20’ని ప్రారంభించారు. 2025 నాటికి దేశంలో వినియోగించే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని లక్ష్యంగా నిర్ణయించారు. సర్కార్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి దాదాపు 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరం అవుతుంది. ఇతర ఉపయోగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 1,350 కోట్ల లీటర్ల ఇథనాల్‌ భారతదేశ అవసరాలకు సరిపోతుందని 2021లో విడుదల చేసిన ఇథనాల్‌ బ్లెండింగ్‌ ఇన్‌ ఇండియా 2020-25 రోడ్‌ మ్యాప్‌లో నిటి ఆయోగ్‌ అంచనా వేసింది. ‘ఈ20’ లక్ష్యానికి అనుగుణంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం ఈ పరిశ్రమలకు విరివిగా ఉద్దీపణలను ప్రకటించింది. ”భారత దేశం తన అవసరాల కోసం 87 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇథనాల్‌ ఆక్సిజన్‌ అణువులు కలిగి ఉంటుంది. 2014 నుంచి (సీవోటూ) ఉద్గారాలను 544 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గించింది. ఫలితంగా గాలి నాణ్యత ఘణనీయంగా పెరిగింది” అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలోనే భవిష్యత్‌ అవసరాల కోసం ఇథనాల్‌ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెబుతోంది.

రాష్ట్రాల ప్రమేయం లేకుండానే..
‘ఈ 20’ లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ‘సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌’ విభాగం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ కంపెనీలకు నేరుగా అనుమతులిస్తోంది. 2006 పర్యావరణ చట్టానికి సవరణలు చేసి ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు నిచ్చింది. అలాగే ఈ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి రాయితీలను ప్రకటించింది. 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. ఇథనాల్‌లో వాడే ముడి సరుకు దిగుమతులపై సుంకాలను రద్దు చేసింది. ‘ఇథనాల్‌ ఇంటరెస్ట్‌ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌’ కింద వడ్డీలో రాయితీ ప్రకటించింది. అలాగే ఐదేండ్ల మారిటోరియం ప్రాతిపదికన రుణాలు ఇచ్చేలా బ్యాంకింగ్‌ రంగాన్ని ఒప్పించింది. ఫలితంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో సైతం అనేక మంది కంపెనీల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి, ఎన్నింటికి అనుమతులిచ్చారు అనే సమాచారం తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం (ఐడీఆర్‌యాక్ట్‌) ప్రకారం ఇథనాల్‌ తయారీ కేంద్ర జాబితాలో చేరిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇథనాల్‌ తయారీ యూనిట్ల నిర్మాణ అనుమతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైందనీ, లైసెన్స్‌, రవాణా, మార్కెటింగ్‌, తదితర అంశాలతో వాటికి ఏ సంబంధం లేదని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -