Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకణతపై తుపాకీ పెట్టినా నిజమే చెప్తా

కణతపై తుపాకీ పెట్టినా నిజమే చెప్తా

- Advertisement -

– కాళేశ్వరం సమాచారం వారిద్దరి వద్దే
– ఈటలను క్రాస్‌ఎగ్జామిన్‌ చేసిన న్యాయ కమిషన్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

‘నా కణతపై తుపాకీ పెట్టినా నిజమే చెప్తానని’ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్‌ ఆయన్ను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసింది. అఫిడవిట్‌ తీసుకుంది. విచారణ ముగిసిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్‌, హరీశ్‌రావు దగ్గరే ఉందని తెలిపారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదన్నారు. ఆ శాఖకు అన్ని విషయాలూ తెలియవని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్రేమీ లేదు. ప్రాజెక్టు రీడిజైనిం గ్‌ కోసం కేసీఆర్‌ క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చైర్మెన్‌గా ఉన్నారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ వద్ద ఆనకట్టు నిర్మాణం చేపట్టారు. బ్యారేజీల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించి అంశం. ఆ నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలియదు. రూ. 63 వేల కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం రూ. 82 వేల కోట్లకు పెరిగిందని ఈటల చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ రుణాలపై ఆర్ధిక శాఖ ప్రమేయం ఉందా అని కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఈటలను అడగ్గా దీనిపై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇది పూర్తిగా నీటిపారుదల శాఖకు సంబంధించినదన్నారు. నా కణతపై తుపాకీ పెట్టినా సరే..నిజమే మాట్లాడతా..తప్పుఒప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలి. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. కఠినంగా శిక్షించాలి. ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్‌ వందలసార్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవీలో ఉన్నా నైతిక విలువలు పాటించా’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.
కమిషన్‌ ఎదుట ఈటల చెప్పిన అంశాలివే..
క్యాబినెట్‌ నిర్ణయం మేరకే బ్యారేజీల నిర్మాణం జరిగిందని ఈటల రాజేందర్‌ కాళేశ్వరం కమిషన్‌కు చెప్పినట్టు సమాచారం. ఇన్‌కెమెరాలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మెన్‌ పీసీ ఘోష్‌ పలు ప్రశ్నలు సంధించారు. ఈసందర్భంగా ఈటల స్పందిస్తూ సాంకేతిక కమిటీ, క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సిఫారసు మేరకు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లోకేషన్‌ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్టు చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్టు వివరించారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డీపీఆర్‌లో ఉందన్నారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అని ఈటలను కమిషన్‌ ప్రశ్నించగా, నిర్మాణ అంశాలన్నీ నీటిపారుదల శాఖ కిందకే వస్తాయని ఈటల సమాధానం చెప్పారు. మూడు బ్యారేజీలపై ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు అని కమిషన్‌ అడగ్గా, క్యాబినెట్‌ నిర్ణయం మేరకేనని బదులిచ్చారు. టెక్నికల్‌ కమిటీ రిపోర్టు ఇచ్చిందా అని ప్రశ్నించగా, టెక్నికల్‌ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చిందనీ, తుదిగా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని ఈటల వివరించారు. రీడిజైన్‌ చేయడానికి సబ్‌ కమిటీ సంతకం చేసిందా అని ఘోష్‌ ప్రశ్నించగా, అందుకు ఈటల స్పందిస్తూ అవును, సబ్‌ కమిటీ సంతకం చేసిందని అంగీకరించారు. డీఆర్పీ కోసం రూ.5.97 కోట్లు వ్యాప్కోస్‌ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా అని అడగ్గా తెలియదని ఈటల జవాబిచ్చారు. రుణాలు ఎలా రీపేమెంట్‌ చేయాలని అనుకున్నారని కమిషన్‌ అడగ్గా, కార్పొరేషన్‌ నుంచి నిధులను సమకూర్చుకుని రుణాలు తిరిగి చెల్లించాలని అనుకున్నామనీ, అయితే అలా చేయలేకపోయినట్టు అంగీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -