Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతలతాకట్టు పెట్టయినా..సంక్షేమ ఫలాలు అమలు చేస్తాం

తలతాకట్టు పెట్టయినా..సంక్షేమ ఫలాలు అమలు చేస్తాం

- Advertisement -

ములుగు జిల్లాకు మరో వెయ్యి ఇండ్లు మంజూరు
అర్హులందరికీ దశలవారీగా ఇస్తాం : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క
నవతెలంగాణ – ములుగు

ఇందిరమ్మ రాజ్యమంటే రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని, గత పాలకులు చేసిన అప్పులను తీర్చుకుంటూనే తల తాకట్టు పెట్టయినా సంక్షేమ ఫలాలను అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా ఇంచర్ల గ్రామం లోని ఇందిరమ్మ కాలనీలో 23మంది లబ్దిదారులకు ఇందిర మ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయడమే కాకుండా ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ములుగు నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరు కాగా ఐటీడీఏకు మరో 1500 ఇండ్లు మంజూరయ్యాయని, తాను మరో వెయ్యి ఇండ్లను మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారులకు వెంటనే ఉచితంగా ఇసుక కోసం కూపన్లను అందజేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అటవీశాఖ అధికారులు సైతం ఇండ్ల నిర్మాణ పనులను అడ్డుకోవద్దని అన్నారు. రానున్న రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తమకు అండగా ఉండాలని కోరారు. జిల్లాను పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాంతంగా మార్చడానికి నిధులు కేటాయించినట్టు చెప్పారు. రూ.70కోట్లతో రామప్పలో పనులు చేపట్టడమే కాకుండా రూ.30 కోట్లతో ఐలాండ్‌ అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ప్రతి మహిళ.. మహిళా సంఘాల్లో చేరి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొంది పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఇక్కడి ప్రాంతంలోని మహిళలకు ఇతర ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన బొంగు చికెన్‌పై శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని టేకులగూడెం అనే చిన్న ప్రాంతంలో కూడా స్వయంగా మంత్రుల ద్వారా ఇందిరమ్మ గృహాల శంకుస్థాపన జరగడం ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. ఏజెన్సీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేవలం 140 గృహాలు ఉన్న చిన్న గ్రామానికి కూడా ప్రత్యేక వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేసి నీరు అందించిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరీష్‌, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రవి చందర్‌, అదనపు కలెక్టర్లు మహేందర్‌ జి, సంపత్‌ రావు, ఆర్డీవో వెంకటేష్‌, ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -