Saturday, May 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మెలో ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ పాల్గొనాలి

సమ్మెలో ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ పాల్గొనాలి

- Advertisement -

– తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు
– ఆర్టీసీ కళాభవన్‌ నుంచి బస్‌ భవన్‌ వరకు కార్మిక కవాతు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ఈ నెల 7(రేపటి) నుంచి జరగబోయే సమ్మెలో ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ పాల్గొనాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ నుంచి బస్సు భవన్‌ వరకు కార్మిక కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మెన్‌ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10 ఏండ్ల కాలంలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా.. సమస్యలను పెంచి ఆర్టీసీ ఉద్యోగులను సర్వనాశనం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, వేతన సవరణలు చేస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని, ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని, కొత్త బస్సులు కొంటామని పొందుపరిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా సమస్యలను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ ముందుండి పని చేశారని, అటువంటి తమను విస్మరించడం తగదన్నారు. జేఏసీ కో చైర్మెన్‌ కె.హనుమంతు ముదిరాజ్‌ మాట్లాడుతూ.. టీజీఎస్‌ ఆర్టీసీలో ప్రస్తుతం యూనియన్లు లేకపోవడంతో ఎంటీడబ్ల్యూ యాక్ట్‌ అమలు చేయకుండా రోజుకు 16 గంటల వరకు డ్యూటీలు చేయిస్తున్నారని ఆరోపించారు. 2021-25 వేతన సవరణ వెంటనే చేయాలని డిమాండ్‌ చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, కానీ పనిచేస్తున్న సిబ్బందిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్‌, సీసీఎస్‌, ఎస్‌ఆర్టీబీఎస్‌ ట్రస్టుల నుంచి యాజమాన్యం వాడుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి నైట్‌ అవుట్‌ అలవెన్స్‌ బేటాలు, పెన్‌ అలవెన్స్‌లు ఏమీ ఇవ్వలేదన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్‌ చైర్మెన్‌ ఏం.థామస్‌రెడ్డి, కన్వీనర్‌ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్‌, బి.యాదగిరి, జేఏసీ నాయకులు ఎస్‌.బాబు, డీవీకే రావు ఎం.వెంకటి గౌడ్‌, కమలాకర్‌ గౌడ్‌, యాదయ్య గౌడ్‌, ఎండీ అహ్మద్‌, అలీ బాబు, కేఎస్‌ పాల్‌, పి.అప్పారావు, రాంరెడ్డి, శ్రీనయ్య, ప్రేమ్నాద్‌, స్వాములయ్య, శ్రీనివాస్‌ గౌడ్‌, రాములు, పికె.మూర్తి, డి.రామచందర్‌, బి.శ్రీనివాస్‌, పాండురంగయ్య, బి.జ్యోతి, ఎన్‌.మంగ, కె.సుజాత, రేణుక, కళ్యాణి, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -