Saturday, March 7, 2026
E-PAPER
Homeఆటలుభారత జట్టులో ప్రతి ఒక్కరూ ప్రమాదకరమే : న్యూజిలాండ్ కెప్టెన్

భారత జట్టులో ప్రతి ఒక్కరూ ప్రమాదకరమే : న్యూజిలాండ్ కెప్టెన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: “మా లక్ష్యం ఒక్కటే… అహ్మదాబాద్ స్టేడియంలోని లక్షలాది మంది ప్రేక్షకులను నిశ్శబ్దంలో ముంచెత్తడం”. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్స్‌కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చేసిన వ్యాఖ్యలివి. స్వదేశంలో, నిండిన స్టేడియంలో టైటిల్ గెలవాలనే తీవ్ర ఒత్తిడి టీమిండియాపైనే ఉంటుందని, ఇదే తమకు అవకాశంగా మారుతుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఇవాళ‌ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శాంట్నర్ మాట్లాడుతూ… 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను పునరావృతం చేశాడు.

అహ్మదాబాద్ పిచ్‌ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… “నేనింకా పిచ్‌ను చూడలేదు. అది ఇంకా కవర్ల కిందే ఉంది. కానీ, ఇది ఫ్లాట్‌గా, హై స్కోరింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నా” అని శాంట్నర్ తెలిపాడు. గతంలో ఇదే వేదికపై జరిగిన ఐసీసీ ఫైనల్ మ్యాచ్ పిచ్‌పై తీవ్ర చర్చ జరిగిన నేపథ్యంలో శాంట్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీమిండియా బౌలింగ్ దళంపై, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాపై శాంట్నర్ ప్రశంసలు కురిపించాడు. “బుమ్రా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సిందే. అతను ప్రపంచ స్థాయి బౌలర్. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అతనే మ్యాచ్‌ను మలుపు తిప్పాడు” అని కొనియాడాడు. అయితే, భారత జట్టు బలం కేవలం ఒక్కరిపైనే ఆధారపడి లేదని స్పష్టం చేశాడు. “ముప్పు కేవలం బుమ్రా నుంచే కాదు. భారత జట్టులో ప్రతి ఒక్కరూ ప్రమాదకరమే. బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో వేర్వేరు సమయాల్లో ఒక్కొక్కరు ముందుకొచ్చి జట్టును గెలిపిస్తున్నారు. ఒక జట్టుగా ఇదే అత్యుత్తమ స్థితి” అని శాంట్నర్ విశ్లేషించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -