నవతెలంగాణ హైదరాబాద్: అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని మూడ్రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదుల సమక్షంలో మాజీ మంత్రిని విచారించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాకాణిని మళ్లీ ఆదివారం సాయంత్రం 5గంటలకు పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం వంటి అభియోగాలపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో కాకాణి నాలుగో నిందితుడి (ఏ4)గా ఉన్నారు.