నవతెలంగాణ-హైదరాబాద్: మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలోని ఒక గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన థాంగ్స్కు ప్రాంతంలో జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ వికాశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులురాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళంను రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టమని కోరారు. అయితే విపత్తు దళం సంఘటనా స్థలానికి చేరుకోలేదని వికాశ్కుమార్ పేర్కొన్నారు. ఈ బొగ్గు గనిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న సమయంలోనే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు అభిప్రాయపడ్డారు.
కాగా, పర్యావరణ భద్రత దృష్ట్యా 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ మేఘాలయలో అక్రమ గనుల తవ్వకంపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో బొగ్గు గనుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉండడం గమనార్హం.



