నవతెలంగాణ – హైదరాబాద్; హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయకు వెళ్లి అక్కడ అదృశ్యమైన జంట కేసులోని చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. తొలుత భర్త మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, ఆపై కనిపించకుండా పోయిన భార్య కోసం గాలిస్తుండగానే ఆమె అనూహ్యంగా పోలీసులకు లొంగిపోయింది. విచారణలో భర్తను చంపించింది తానేనని చెప్పడంతో పోలీసులే విస్తుపోయారు. ఈ మొత్తం ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు ఇటీవల వివాహం చేసుకుని హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23వ తేదీ నుంచి సోనమ్ కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ కిరాయి హంతకులను నియమించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ దారుణమైన కుట్రను ఛేదించిన పోలీసులు ఈ తెల్లవారుజామున నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజా రఘువంశీ భార్య సోనమ్ను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అరెస్ట్ చేయగా, ఈ హత్యకు సహకరించిన ముగ్గురు కిరాయి హంతకులను ఇండోర్లో అరెస్ట్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ప్రమేయమున్న మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసింది. ఈ వార్త ఇండోర్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.