నవతెలంగాణ-హైదరాబాద్ : సీపీఐ(ఎం) నాయకత్వంలో పోరాడి విజయం సాధించుకున్న రావిరాల`జన్నాయిగూడెం ఫాబ్సిటీ భూ నిర్వాసితులు ఈ రోజు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీని కలిసి అభినందించారు. దశబ్దాలుగా పోరాట ఫలితంగా వీరికి ఎకరాకు 150 నుండి 250 గజాల ఇంటిస్థలం వచ్చిందని, భూమికి నష్టపరిహారం, తదితర హామీలు నెరవేరలేదని వాటి అమలుకోసం పోరాటాలు నిర్వహించాలని జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా, రావిరాల ` జన్నాయిగూడెంలో 224 మంది రైతుల వద్ద 827 ఎకరాల భూమిని 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫాబ్ సిటీ నిర్మాణ కోసం తీసుకోకున్నది. భూమి పొజిషన్లో ఉన్న వారికి ఎకరాకు 150 గజాలు, భూమి కోల్పోయిన సీలింగ్ రైతులకు ఎకరాకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్న హామి అమలు కోసం రైతులు రెండు దశబ్ధాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫాబ్ సిటీలో పారిశ్రామికవేత్తలకు మాత్రం పరిశ్రమల నిర్మాణాలకు అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల రావిరాల ప్రాంత సందర్శన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సీపీఐ(ఎం) ప్రతిఘటన కార్యక్రమాలకు పూనుకోగా, అధికారులు చర్చించి రైతులకు ఇస్తామన్న 150 నుండి 250 గజాల స్థలాల ఉచిత రిజిస్ట్రేషన్, ఇళ్ల స్థలాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందనే ఒప్పందం జరిగింది. నేటికీ నలుగురికి రిజిస్ట్రేషన్స్ కూడా జరిగాయి. ప్రస్తుతం ఒక ఎకరా సుమారు రు.20 కోట్ల విలువ ఉంటుంది. ప్లాటు విలువ కేవలం రు.60లక్షలు మాత్రమే ఉంటుంది. ఇళ్ల స్థలాల సాధన ఒక విజయం మాత్రమేనని జాన్వెస్లీ పేర్కొన్నారు.
ప్రభుత్వం సేకరించిన ఇట్టి భూమికి నేటికీ నష్టపరిహారం చెల్లించలేదని, ముఖ్యమంత్రి కాలయాపన చేయకుండా వెంటనే మిగిలిన రైతులందరికీ ప్లాట్ల కేటాయింపుతో పాటు, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, మిగతా హామీల అమలు ప్రక్రియను పూర్తి చేయాలని జాన్వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రైతులకు, కూలీలకు, పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటాల్లో సీపీఐ(ఎం) ముందుంటుందని జాన్వెస్లీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి రామచందర్, ఆర్ స్వామి, నిర్వాసితుల నాయకుడు నర్సింహ, ప్రశాంత్, నాగేష్, భిక్షపతి, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.



