Sunday, June 8, 2025
E-PAPER
Homeజాతీయందౌత్యంలో ఫెయిల్‌!

దౌత్యంలో ఫెయిల్‌!

- Advertisement -

– ఐరాసలో ఎదురు దెబ్బలు
– కలిసిరాని అంతర్జాతీయ సమాజం
– అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై కనిపించని ప్రభావం
– ఒత్తిళ్లకు లొంగిపోతున్న మోడీ ప్రభుత్వం
ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైనిక దళాలు పాకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మోడీ ప్రభుత్వం అవలంబించిన దౌత్య వైఖరి కారణంగా మన దేశం అనేక బలమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన అనంతరం చోటుచేసుకున్న కీలక అంతర్జాతీయ పరిణామాల ఫలితంగా మనం అనేక వ్యూహాత్మక ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. పాక్‌పై సాధించిన విజయాలతో ప్రపంచ దేశాలను ప్రభావితం చేసి భారత్‌కు మద్దతు కూడగట్టడంలో నరేంద్ర మోడీ విదేశాంగ విధానం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.

న్యూఢిల్లీ : ప్రధాని మోడీని తొలుత అందరూ విశ్వగురు అని పిలిచే వారు. ఆ తర్వాత ఆయన విశ్వమిత్ర (ప్రపంచ స్నేహితుడు)గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇవేవీ సంక్షోభ సమయంలో మనకు అక్కరకు రాలేదు. తాజాగా ఐరాస భద్రతా మండలిలో చోటుచేసుకున్న పరిణామం భారత్‌కు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. భద్రతా మండలికి చెందిన తాలిబాన్‌ ఆంక్షల కమిటీ అధ్యక్ష పదవి పాకిస్తాన్‌ను వరించింది. అంతేకాక ఉగ్రవాద వ్యతిరేక కమిటీ ఉపాధ్యక్ష పదవిని కూడా పాకిస్తాన్‌కే కట్టబెట్టారు. ఈ ఎంపికలు భారత్‌కు దౌత్యపరంగా ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. మన ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ దీనిని అడ్డుకోలేక పోయింది. ఈ సరికొత్త పాత్రతో ఉగ్రవాదం, ఆఫ్ఘనిస్తాన్‌పై సరికొత్త నిర్వచనాలు ఇచ్చే అవకాశం పాక్‌కు లభిస్తుంది. ఇది భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.
భద్రతా మండలి సభ్య దేశాలను మన వైపుకు తిప్పుకునేందుకు అఖిలపక్ష బృందాలను పంపడంతో పాటు మోడీ ప్రభుత్వం ఎన్ని దౌత్య ప్రయత్నాలు చేసినప్పటికీ పాకిస్తాన్‌ ఆ పదవులను చేజిక్కించుకోగలిగింది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద కేంద్రంగా చూపేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను ఈ పరిణామం బలహీనపరుస్తోంది. భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ముందుకు తీసికెళ్లేందుకు ఈ పదవులను పాకిస్తాన్‌ అడ్డం పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రపంచ వేదికలపై భారత్‌ ప్రభావం రానురానూ తగ్గిపోతోందని చెప్పడానికి ఈ పరిణామాలు సంకేతాలుగా నిలుస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ నిర్ణయాలలో పొరుగు దేశాల ప్రమేయం పెరిగిపోతోంది.
బలహీనపడుతున్న వైఖరి
భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నెరపిన మధ్యవర్తిత్వాన్ని రష్యా అధినేత పుతిన్‌ ఆమోదించడం భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశమే. కాశ్మీర్‌ వివాద పరిష్కారంలో మూడోపక్షం ప్రమేయాన్ని అంగీకరించబోమన్న భారత్‌ వైఖరిని ఇది సవాలు చేస్తోంది. ట్రంప్‌ వ్యక్తిగత జోక్యంతోనే వివాదం సద్దుమణిగిందని పుతిన్‌ వ్యాఖ్యానించడాన్ని చూస్తుంటే అంతర్జాతీయ ఒత్తిడి కారణంగానే మోడీ చర్చలకు సిద్ధపడ్డారని, అమెరికా ఒత్తిడికి లొంగిపోయారని వస్తున్న కథనాలకు బలం చేకూరుతోంది. పాకిస్తాన్‌తో వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్న భారత్‌ దీర్ఘకాల వైఖరి బలహీనపడుతోంది. క్లిష్టతరమైన భద్రతా సంక్షోభాలు తలెత్తినప్పుడు భారత్‌ వ్యూహాత్మక స్వయంప్రత్తిపత్తిపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి.
ఆర్థిక సంస్థలపై ప్రభావం పరిమితమే
భారత్‌ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుండి పాకిస్తాన్‌ రుణాలు పొంద గలిగింది. ప్రపంచ ఆర్థిక సంస్థలపై మోడీ ప్రభుత్వ ప్రభావం పరిమితమేనని దీంతో స్పష్టమై పోయింది. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ నుండి బిలియన్‌ డాలర్లు, ప్రపంచబ్యాంక్‌ నుండి 40 బిలియన్‌ డాలర్లు, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుండి 800 మిలియన్‌ డాలర్ల రుణం లభించింది. పాకిస్తాన్‌ రక్షణ వ్యయం పెరుగుతోందని, కీలక సంస్కరణలలో పురోగతి లేదని, కాబట్టి ఆర్థిక సంస్థలు అందించే రుణాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నదని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి నిధులు అందడాన్ని చూస్తుంటే వాటిపై మన ప్రభావం పరిమితమేనని తేలిపోయింది. పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఒంటరిని చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
లభించని అంతర్జాతీయ మద్దతు
కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పహల్గాం దాడిలో పాక్‌ పాత్రను, ఆ తర్వాత పెరిగిన ఉద్రిక్తతల విషయంలో దాని ప్రమేయాన్ని ప్రపంచ దేశాలు ఖండించేలా చేయడంలో విఫలమైందనే చెప్పాలి. ఉగ్రవాద దాడిని అనేక దేశాలు షరా మామూలుగానే ఖండించాయి. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ వంటి వేదికలలో పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్న భారత్‌ పిలుపుకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. ఓ భారీ ఉగ్రవాద చర్య జరిగినప్పుడు, సైనిక ఘర్షణ జరిగినప్పుడు కూడా బలమైన అంతర్జాతీయ మద్దతు కొరవడడం మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానపు పరిమితులను బయటపెడుతోంది. సైనిక పరంగా విజయాలు సాధించినప్పటికీ ప్రభుత్వ విదేశాంగ విధానం పాకిస్తాన్‌పై దౌత్యపరమైన పైచేయి సాధించడానికి ఎంతమాత్రం ఉపకరించలేదు. క్లిష్ట సమయంలో ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలలో భారత్‌ ఒంటరిగా నిలవాల్సి వచ్చింది. అంతర్జాతీయ వేదికలలో పెరుగుతున్న ప్రత్యర్థుల ప్రభావం, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టలేకపోవడం వంటి పరిణామాలు ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాతావరణంలో భారత్‌కు ఎదురవుతున్న సవాళ్లను సూచిస్తున్నాయి. దౌత్యపరంగా తగ్గిపోతున్న మన ప్రభావాన్ని, ఎదురవుతున్న వ్యూహాత్మక ఎదురు దెబ్బలను ప్రధాని మోడీ వాక్చాతుర్యం ఏ మాత్రం ఒడ్డున పడేయలేక పోతోంది.

ఐరాసలోనూ భంగపాటే
ఐక్యరాజ్య సమితిలోనూ దౌత్యపరంగా భారత్‌కు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. పహల్గాం దాడిలో పాక్‌ ఉగ్ర మూకల హస్తాన్ని ఐరాస ఖండించలేదు. ఉగ్రదాడికి వ్యూహరచన చేసిన వారి పేర్లను భద్రతా మండలి ప్రకటనలో చేర్చకుండా అడ్డుకోవడంలో పాక్‌ విజయం సాధించ గలిగింది. దీంతో భారత్‌ వాదనలు నీరుకారిపోయాయి. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి మోడీ ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపినప్పటికీ ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడం లేదు. మనకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటనలు చేయడం లేదు. తన ఆందోళనలపై ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -