నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, వారిలో 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం. వీరిని వేగవంతమైన విచారణ కోసం అధికారులు కోర్టుకు సిఫార్సు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా, దేశంలో అస్థిరత సృష్టించేలా ఫేక్ పోస్టులు పెట్టారని వీరిపై అభియోగాలు నమోదయ్యాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సృష్టించిన నకిలీ వీడియో క్లిప్లు, క్షిపణి దాడుల వీడియోలకు భయానక వ్యాఖ్యానాలు జోడించి సర్క్యులేట్ చేశారని యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ వెల్లడించారు. మార్చి 14, 15 తేదీల్లో రెండు విడతలుగా ఈ అరెస్టులు జరిగాయి. నిందితులు మూడు బృందాలుగా విడిపోయి ఈ చర్యలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కొందరు శత్రు దేశ సైనిక చర్యలను కీర్తిస్తూ పోస్టులు చేయగా, మరికొందరు పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చిత్రీకరించారు. యూఏఈ సైబర్క్రైమ్ చట్టం ప్రకారం ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే కనీసం ఏడాది జైలు శిక్ష, లక్ష దిర్హమ్ల (దాదాపు రూ. 22 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉంది.



