– సమర్పించినదానికి, వార్షిక నివేదికకు మధ్య భారీ వ్యత్యాసాలు
– ఆదాయ, వ్యయాల గణాంకాల్లో తేడాలు
– దేశంలోని పలు ఉన్నత విద్యాసంస్థల తీరిది
– జాబితాలో పలు ఐఐటీ, ఐఐఎంలు
– ఫలితంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విశ్వసనీయతకు దెబ్బ
– కఠినమైన యంత్రాంగాలు లేకపోవటంతో ఈ పరిస్థితి
– విద్యావేత్తలు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ: ప్రతి ఏడాదీ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఉన్నత విద్యా సంస్థల వార్షిక ర్యాంకింగ్లను విడుదల చేస్తుంది. 2016 నుంచి ప్రచురించబడుతున్న ఈ ర్యాకింగ్లు ప్రభుత్వ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఆధారంగా లెక్కించబడతాయి. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, మెడిసిన్, లాతో సహా వివిధ విభాగాల్లో ర్యాంకింగ్లు ప్రచురితమవుతాయి. ప్రతి విభాగంలో, ఆ ఏడాది దేశంలో అత్యుత్తమంగా అంచనా వేసిన 200 సంస్థలను సంబంధిత మంత్రిత్వ శాఖ జాబితా చేస్తుంది. విద్యాసంస్థలకు అందించే ఈ ర్యాంకులు విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తాయి. ఏ సంస్థలో, ఏ కోర్సు తీసుకోవాలి అన్న విషయంలో వారికి ఒక స్పష్టతనేది వస్తుంది.
అయితే, ఈ ర్యాంకింగ్లను ఎంత వరకు నమ్మొచ్చు? ఇవి కఠినమైన పద్దతి, స్థిరమైన డేటాపై ఆధారపడి ఉన్నాయా? అన్నదానిపై అనేక ప్రశ్నలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత సెప్టెంబర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ముంబయి, ఉద్యోగి ఒకరు ఎన్ఐఆర్ఎఫ్కు సమర్పించిన డేటాలో ఆదాయం, వ్యయం, అధ్యాపకుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను పెంచి చూపించారని ఆరోపణలు చేసిన సందర్భంలో ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది. ఎన్ఐఆర్ఎఫ్కు ఇన్స్టిట్యూట్ సమర్పించిన డేటాను, దాని వార్షిక నివేదికలో సమర్పించిన డేటాను విశ్లేషించటం ద్వారా కూడా గణనీయమైన వ్యత్యాసాలు బయట పడ్డాయి. దీంతో విద్యాసంస్థలకు ర్యాంకింగ్లు ఇచ్చే విధానంపై నమ్మకం సన్నగిల్లుతున్నది. కేవలం.. విద్యాసంస్థల స్వీయ-నివేదిత డేటాపై ఆధారపడి ర్యాంకులను కేటాయించటం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అయితే, ఇది ఐఐఎం ముంబయి వరకే పరిమితమైందా లేదా ఇతర విద్యాసంస్థల విషయంలోనూ ఇవే పరిస్థితులున్నాయా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
సంఖ్యలను ఎక్కువగా చేసి చూపిస్తున్న తీరు
టాప్టెన్లో ర్యాంక్ పొందిన అన్ని ప్రభుత్వ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ సంస్థలు ఎన్ఐఆర్ఎఫ్కు సమర్పించిన డేటాను స్క్రోల్ పరిశీలించింది. 2022-2023 డేటాను ఎంచుకున్నది. ఆ ఏడాది మేనేజ్మెంట్ విభాగంలో టాప్ 10 ఇన్స్టిట్యూట్లలో ఏడు ఐఐఎంలు ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో తొమ్మిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఉన్నాయి. అయితే, ఈ సంస్థలు ఎన్ఐఆర్ఎఫ్కు సంబంధించిన డేటాను విశ్లేషించగా.. వాటి వార్షిక నివేదికలతో పోల్చి చూసినపుడు గణనీయమైన వ్యత్యాసాలు బయట పడ్డాయి. అయితే, ఈ వ్యత్యాసాలకు సంబంధించి ప్రశ్నించినపుడు చాలా సంస్థలు మొఖం చాటేశాయి. ఈ విధానంపై ప్రభుత్వ సంస్థలలో అనుభవమున్న, పేరు చెప్పటానికి ఇష్టపడని కొందరు ప్రొఫెసర్లు స్పందించారు. డేటాను ఎలా వర్గీకరించాలో స్పష్టత విస్తృతంగా లేకపోవటాన్ని వారు అంగీకరించారు. విద్యా సంస్థలు అధిక ర్యాంక్లను పొందే క్రమంలో తరచుగా సంఖ్యలను ఎక్కువ చేసి చూపిస్తాయన్న విషయాన్ని తాను విన్నానని ఒక ఐఐటీ ప్రొఫెసర్ చెప్పారు.
ఐఐఎంల తీరిది
ఐఐఎంల ఎన్ఐఆర్ఎఫ్ పత్రాలలో.. ఖర్చు రెండు విభాగాలుగా విభజించబడింది. ఒకటి..కార్యాచరణ వ్యయం. రెండోది.. మూలధన వ్యయం. అయితే, ఐఐఎంలు ఇందుకు విరుద్ధంగా తమ వార్షిక నివేదికలు వ్యయాన్ని అనేక విభాగాలుగా విభజిస్తాయి. వాటిలో సిబ్బంది చెల్లింపులు, ప్రయోజనాలు, విద్యాఖర్చులు, అడ్మినిస్ట్రేషన్, సాధారణ ఖర్చులున్నాయి. ఖర్చులకు సంబంధించిన విషయాల్లోనూ అనేక వ్యత్యాసాలుంటాయని కొందరు చెప్తున్నారు. ఉదాహరణకు, 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐఐఎం అహ్మదాబాద్.. ఎన్ఐఆర్ఎఫ్కు అందించిన డేటాలో రూ.260.21 కోట్లను చూపిస్తే.. ఆ సంస్థ వార్షిక నివేదికలో మాత్రం రూ.309.54గా ఉండటం గమనార్హం. అలాగే, కోజికోడ్, ఇండోర్, కలకత్తా, లక్నో, బెంగళూరులకు చెందిన ఐఐఎంలు.. ఖర్చుల విషయంలో ఎన్ఐఆర్ఎఫ్ డేటాకు, సంస్థల వార్షిక నివేదికకు మధ్య వ్యత్యాసాలు నమోదు కావటం గమనార్హం. అలాగే, ఈ విద్యాసంస్థల ఆదాయాల విషయాలలో కూడా భారీ వ్యత్యాసాలున్నాయి.
ఐఐటీల డేటా
దేశంలో 2022-23 సంవత్సరానికి ఇంజినీరింగ్ జాబితాలో మొదటి పది ర్యాంకులలో ఉన్న తొమ్మిది ఐఐటీలు ఉన్నాయి. ఇందులో ఏడు సంస్థలు సమర్పించిన డేటాను స్క్రోల్ విశ్లేషించింది. ఆదాయ, వ్యయాల విషయాల్లో ఐఐఎంలలో చోటు చేసుకున్న వ్యత్యాసాలే ఇక్కడా కనిపించాయి. ఉదాహరణకు, ఐఐటీ మద్రాసు.. ఎన్ఐఆర్ఎఫ్కు వ్యయాన్ని రూ.1360 కోట్లకు పైగా చూపించింది. కానీ, ఇది ఆ సంస్థ వార్షిక నివేదికలో రూ.727.55 కోట్లుగానే ఉన్నది. అంటే.. రూ.633 కోట్ల భారీ వ్యత్యాసం ఇక్కడ కనిపించింది. ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ బీహెచ్యూలతో పాటు ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా ఎన్ఐఆర్ఎఫ్కు అధిక వ్యయ గణాంకాలను చూపించాయి. ఎన్ఐఆర్ఎఫ్ నిర్వచనాలను మరింత స్పష్టం చేస్తే.. డేటాకు సంబంధించిన విషయంలో గందరగోళాన్ని నివారించవచ్చని ఒక ఐఐటీ ప్రొఫెసర్ చెప్పారు. తగినంత స్పష్టత లేని కారణంగానే ఇది చోటు చేసుకున్నదని అన్నారు
డేటాపై గందరగోళం
ఎన్ఐఆర్ఎఫ్ వ్యవస్థను విశ్లేషించిన నిపుణులు.. గతంలో ర్యాంకింగ్ల కోసం సమర్పించిన డేటా విషయానికొస్తే స్పష్టత, పారదర్శకత లేకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జూన్లో ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ వి. రామ్గోపాల్రావు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) నుంచి అభిషేక్ సింగ్ ర్యాంకింగ్లపై ఒక పత్రాన్ని సమర్పించారు. వ్యవస్థలో అనేక లోపాలు, అసమానతలను కనుగొన్నారు. ”స్వీయ-నివేదిత డేటాపై ఆధారపడటంతో సమర్పించబడిన సమాచారం.. స్థిరత్వం, కచ్చితత్వానికి సంబంధించి ప్రశ్నలను లేవనెత్తుతాయి. సమర్పించిన డేటా కచ్చితత్వం, ఏకరూపతను ధృవీకరించటానికి కఠినమైన యంత్రాంగాలు లేకపోవటం ర్యాంకింగ్లలో అనిశ్చిత అంశాన్ని తీసుకొస్తుంది. ఇది ర్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది” అని వారు వివరించారు.