Monday, June 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలువారంలో రైతుభరోసా

వారంలో రైతుభరోసా

- Advertisement -

– ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమం
– రైతుల హామీల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధి
– 18 నెలల్లోనే రూ. 21 వేలకోట్ల రుణమాఫీ : ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-కూసుమంచి

వారంలోగా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆరుగాలం కష్టపడి దేశ ప్రజలకు అన్నంపెట్టే రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆదివారం ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. జోడెడ్ల అరక దున్ని రైతులతో కలిసి విత్తనాలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తాను అమితంగా ప్రేమించే పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక సాగు కార్యక్రమంలో అరక పట్టి, దుక్కిదున్ని, రైతులతో కలిసి విత్తనాలు నాటడం సంతోషాన్నిచ్చిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తూ రైతును రాజు చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక స్థితి బాగోలేకపోయినా ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోంద న్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో రైతులకు రూ.17000 కోట్ల రుణమాఫీ చేస్తే, తమ ప్రభుత్వం 18 నెలల్లోనే రూ.21000 కోట్లు మాఫీ చేసిందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తామన్నారు. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికీ పెట్టుబడి కోసం రూ.12 వేలు ఇస్తామన్నారు. రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చామని, వారంలోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కాళేశ్వరం కూలినా కూడా దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ వెన్నపూసల సీతారాములు, సీడీసీ చైర్మెన్‌ ఎరబోలు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -