నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ సమీపంలో ముస్తఫా కంపెనీ యాజమాన్యం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పొగాకు నాణ్యతను బట్టి కొనుగోలు చేస్తుందని రైతులు పేర్కొన్నారు. గత 11 రోజులుగా కంపెనీ వారు నేడు, రేపు, కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చినప్పటికీ ఇంతవరకు వారు రాకపోవడంతో తాము పండించిన పంట అకాల వర్షాలకు తడిసి ముద్దయిందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రెంజల్ మండలంలో సుమారు 5వేల ఎకరాలలో పొగాకు పంటను పండించారు. రైతులు పండించిన పంటను కొన్ని కంపెనీల వారు రైతులకు ఇచ్చిన హామీ మేరకు కొనుగోలు చేయడానికి ముందుకు రాగా, ఏ కంపెనీ ఆధారం లేకుండానే పండించిన రైతులు ప్రైవేట్ కంపెనీలకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గత పది రోజులుగా తాము పండించిన పంటను విక్రయించడానికి రాత్రింబవళ్లు పడిగాపులు పడినప్పటికీ కొనుగోలు చేసే నాధుడే కరువయ్యారని వారు వాపోయారు.
వి ఎస్ టి కంపెనీ వారు నిర్ణయించిన ధర 13,500 రూపాయలు కాగా, రైతులు పండించిన పంట నాణ్యతను బట్టి క్వింటాలుకు 12000 ,11000, రూపాయలను నిర్ణయించారు. ఏ కంపెనీ అనుమతులు లేకుండా పండించిన రైతులు మాత్రం ప్రైవేటు కంపెనీలకు వారు నిర్ణయించిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి నేలపొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మహారాష్ట్ర రైతులు సైతం అధిక మొత్తంలో పొగాకు పంటను పండించారు. పొగాకు కంపెనీ యాజమాన్యాలు మాత్రం 6000 నుంచి 10000 లోపు పొగాక కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అయినప్పటికీ తమ పొగాకును కొనుగోలు చేయాలని తాము పెట్టిన పెట్టుబడి వచ్చిన తమకు చాలు అంటూ వారు మహారాష్ట్ర నుంచి పొగకును తీసుకువచ్చి ఇక్కడ పది కాపులు పడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తమ పొగాకు తడిసి ముద్ద అవడంతో వారు కంటతడి పెట్టారు. పొగాకు కొనుగోలుదారులు తాము తీసుకువచ్చిన పోవాకును వెంటనే కొనుగోలు చేసినట్లయితే ఈ దుస్థితి వచ్చేది కాదని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కంపెనీ వారు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
సలీం ( రైతు) చించోలి మహారాష్ట్ర
ఈ ఏడాది ఏ కంపెనీ యొక్క అనుమతులు లేకుండానే తాము పొగాకు పంటను పండించామని, వాటిని విక్రయించడానికి ముస్తఫా కంపెనీ వారు ముందుకు రావడంతో తమ గ్రామం నుంచి పోవాకును ఇక్కడికి తీసుకువచ్చామని సలీ పేర్కొన్నారు. గత 11 రోజుల నుంచి నేడు రేపు అంటూ కాలయాపన చేస్తుండడంతో తాము ఒక పూట భోజనం చేస్తూ పంటను విక్రయించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీవారు దాని నాణ్యతను బట్టి తమ పొగాకును కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
సాయిలు (రైతు) బోర్గం….
రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన సాయిలు ఏ కంపెనీ అనుమతులు లేకుండానే తాను పొగాకు పంటను పండించానాని, ముస్తఫా కంపెనీ యాజమాన్యం 6 నుంచి 9వేల లోపు పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు తెలియడంతో తాను పండించిన 32 ఘట్టాలు ఇక్కడికి తీసుకు వచ్చానని సాయిలు పేర్కొన్నారు. పది రోజుల నుంచి యాజమాన్యం నేడు రేపు కొనుగోలు చేస్తామంటూ జాప్యం చేయడంతో రాత్రి ఆకాశం మేఘావృతం కావడంతో ట్రాక్టర్లో తన పొగాకును ఇంటికి తీసుకువెళ్లి భద్రపరచాలని ఆయన తెలిపారు. యాజమాన్యం వారు వెంటనే స్పందించి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.