– తెలంగాణలో విత్తన చట్టం లేకపోవడం దారుణం
– లైసెన్స్ కలిగిన డీలర్ వద్దే ఎరువులు కొనుగోలు చేయాలి :
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
నవతెలంగాణ-కామారెడ్డి
వానాకాలం సాగుకు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివిధ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దరావత్ మోతీరాం నాయక్, జిల్లా నాయకులు గైని సాయిలు, ఎ.సుధాకర్, కె.బన్సీ నాయక్, మలోత్ కిషన్, మలోత్ గోవర్ధన్తో కలిసి శోభన్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన విత్తన కంపెనీలతో రైతులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లైసెన్స్ కలిగిన డీలర్ నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో విత్తన చట్టం లేకపోవడం దారుణమన్నారు. అన్ని పంటల విత్తనాలు కలిసి రాష్ట్రానికి 20 లక్షల క్వింటాళ్లు కావాలన్నారు. రాష్ట్రంలో 444 విత్తన కంపెనీలు, 467 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని, వీటిని వ్యవసాయ శాఖ నియంత్రించలేకపోతున్నదని అన్నారు. నాణ్యత లేని విత్తనాలను సంస్థలు అమ్మడంతో ఏటా 5 లక్షల నుంచి 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఐదు సంవత్సరాలుగా రుణ ప్రణాళికను ప్రకటించడం గానీ, అమలు జరపడం గానీ చేయలేదన్నారు. ఎకరాకు రూ.7,500 రైతు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6000కు తగ్గించిందని తెలిపారు. అది కూడా 2024 రబీ సీజన్లో ఇవ్వలేదని, 2025 యాసంగిలో 53.4 లక్షల మందికి 72 లక్షల ఎకరాలకు రూ.4,366 కోట్లు మాత్రమే చెల్లించిందని అన్నారు. ఆ తర్వాత చెల్లింపులు చేయలేదన్నారు. 2025-26 వానాకాలం ప్రారంభమవుతున్నదని, 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.7,320 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగిన రైతులకు మాత్రమే రూ.5లక్షల బీమా వర్తింపజేస్తున్నారని, దీన్ని 65 ఏండ్లకు పెంచాలని కోరారు. బీమా ప్రీమియం వల్ల కంపెనీలకు వేలకోట్ల లాభాలు వస్తున్నాయని, కాబట్టి ప్రభుత్వమే ఒక శాఖను ఏర్పాటుచేస్తే ప్రస్తుతం చెల్లించే ప్రీమియంలో సగంతో బీమా పరిహారం చెల్లించొచ్చని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనితీరు ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. ప్రభుత్వ బడ్జెట్ అంచనాల ప్రకారం 2024-25లో 35.25 లక్షల మంది రైతులకు రూ.90,792 కోట్ల పంట రుణాలు లక్ష్యంగా నిర్ణయించి రూ.60,713 కోట్లు (66.87శాతం) మాత్రమే పంపిణీ చేసినట్టు చెప్పారు. మొత్తం 72 లక్షల మంది రైతు కమతాలు ఉండగా బ్యాంకులు 45 లక్షల మందికి మాత్రమే రుణ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విధానం సరిచేసి అందరికీ పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వారికున్న భూమి మేరకు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారని, 2025-26లో మొత్తం రైతుల పంటల ఆధారంగా 2025 జూన్ 15 నాటికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలన్నారు. బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా రైతులందరికీ పంటల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ మినహా మిగిలిన పంటలకు నిర్ణయించిన బోనస్ ఇవ్వడం లేదన్నారు. జిలుగు విత్తనాల ధరలు రూ.1124 నుంచి రూ.2137కు పెంచిందని తెలిపారు. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను రక్షించాల్సిన ప్రభుత్వం భారం మోపుతుందని అన్నారు. కార్పొరేట్లకు లాభాలు చేయడం కోసమే కనీస మద్దతు ధర నాటకమాడుతుందని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సూచనలను గత 11 సంవత్సరాలుగా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని ఆమోదించాలని, వ్యవసాయోత్పత్తుల నిల్వకు తగిన గోదాములను నిర్మించాలని డిమాండ్ చేశారు.
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతులు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES