నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లో రైతులు- ఆపిల్, పండ్ల తోటల పెంపకందారులు రోడ్డెక్కారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా భూ పాలసీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం వైపు భారీ నిరసన చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్ కిసాన్ సభ, హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పెంపకందారుల సంఘం, అనేక ఇతర రైతులు, పండ్ల పెంపకందారుల సంస్థలు సంయుక్తంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలో.. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు, పండ్ల తోటల పెంపకందారులు పాల్గొన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వ్ం, రెవెన్యూ-అటవీ శాఖలు హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ పేద, సన్నకారు రైతులను ఖాళీ చేయించడంతో పాటు ఆపిల్ తోటలను నరికివేయడం వంటివి చేస్తున్నాయని మండిపడ్డారు. హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ఫ్రీ ట్రేడ్ పేరుతో విదేశీ ఆపిల్ దిగుమతులపై తక్కువ సుంకాలు విధిస్తున్నారని, స్వదేశీ పండ్ల ఉత్పత్తుల రక్షణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధానాలు పాటించాలని కోరారు.



