నవతెలంగాణ-గన్నేరు వరం: మండలంలోని పీచుపల్లి గ్రామం డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూకం వేయట్లేదని, డబ్బులు రావట్లేదని కేంద్రంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లె గ్రామ రైతులు రోడ్డెక్కారు. బుధవారం కొనుగోలు సెంటర్ వద్ద రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. డీసీఎంఎస్ సెంటర్లో ధాన్యం పోసి నెలరోజుల గడుస్తున్నా కాంటా చేయడంలో నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
సెంటర్ నిర్వాహకులను, పౌర సరఫరాల అధికారిని ఎవరిని అడిగినా రేపు, మాపు అంటూ నెల రోజులుగా పట్టించుకోవడం లేదని, క్వింటాలుకు మూడు, నాలుగు కిలోలు అదనంగా కాంట వేయనిస్తేనే ధాన్యం కాంట పెడతారా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండనక ,వాననక కష్టపడి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ధాన్యం వెంటనే తూకం వేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరలా నిర్లక్ష్యం వహిస్తే గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై ధర్నా చేపడతామని హెచ్చరించారు.


