– మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..!
నవతెలంగాణ-బోడుప్పల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్లై ఒవర్ పిల్లర్ నెం. 97 వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. అదే కారులో ఉన్న మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వైపు టీఎస్ 32 జీ 1888 నంబర్ కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది వనపర్తి జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థులు. కారు డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడిపినట్టు తెలుస్తోంది.
పిల్లర్ను ఢీకొన్న కారు తీవ్రంగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న సాయి వరుణ్, నిఖిల్ మృతి చెందగా అదే కారులో ఉన్న వెంకట్, రాకేష్, యశ్వంత్ లకు గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్దన్, అభినవ్ లకు ఏలాంటి గాయాలు కాలేదు గాయపడిన వారిని స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, రాత్రి ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.



