నవతెలంగాణ-హైదరాబాద్ : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వరియాలతో వెళ్తున్న బస్సు.. గ్యాస్ సిలిండర్ల వాహనాన్ని ఢీకొన్నది. మంగళవారం ఉదయం 4.30 నిమిషాలకు దేవఘర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతిచెందారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పేర్కొన్నారు. దుమ్కా జోన్ ఐజీ శైలేంద్ర కుమార్ సిన్హా మాట్లాడుతూ.. 32 సీట్లు ఉన్న బస్సులో కన్వరియాలు వెళ్తున్నట్లు తెలిపారు. మోహన్పురా పోలీసు స్టేషన్ పరిధిలోని జామునియా అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ డిప్యూటీ ఎస్పీ లక్ష్మణ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదంలో కనీసం 9 మంది మృతిచెందారని, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
తన లోక్సభ నియోజకవర్గం దేవఘర్లో శ్రావణమాసం సందర్భంగా కన్వర్ యాత్ చేస్తున్న 18 మంది భక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఎంపీ దూబే తెలిపారు. గాయపడ్డవారిని తొలుత మోహన్పుర కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు , ఆ తర్వాత దేవఘర్ సదర్ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారి ఐడెంటిటీ ఇంకా వెల్లడించలేదు. ప్రమాదంలో కనీసం 20 మంది యాత్రికులకు తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు.