నవతెలంగాణ-హైదరాబాద్ : అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో ఈ ఘటన జరిగింది. మృతులను తండ్రి రాజశేఖర్ (54), కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో తండ్రి రాజశేఖర్ మంటల్లో కాలిపోతుండటాన్ని గుర్తించి కుమార్తె రాజశ్రీ కాపాడేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె కూడా తీవ్రగాయాలతో మృతిచెందింది. ఈ ఘటనను చూసిన అల్లుడు ప్రవీణ్ తన పిల్లలతో బయటకు పరుగెత్తి స్థానికులకు తెలిపారు. ఘటనాస్థలాన్ని మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ పరిశీలించారు. అక్కడి వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.



