కొందరు తమను తాము గుర్తించుకుంటారు. తాము నివసిస్తున్న సమాజ అవసరాల్ని గుర్తిస్తారు. తమ కర్తవ్యాన్ని తమకు తామే నిర్ధేశించుకుంటారు. తాము నడుస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. బాధ్యతగల శాస్త్రవేత్తలు చేసిందీ, చేస్తున్నది ఇదే! ఈ కోవకు చెందిన భారతీయ శాస్త్రవేత్తల్లో శాంతి స్వరూప్ భట్నాగర్ (21 ఫిబ్రవరి 1894 – 1 జనవరి 1955) ముఖ్యులు.
ఈ రోజు మన దేశంలో ఉన్న ప్రధాన పరిశోధనా సంస్థలన్నింటికీ ఒకనాడు రూపకల్పన చేసింది ఆయనే. (FATHER OF RESEARCH LABORATORIES). ఆయన గౌరవార్థం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) వారు ప్రతి ఏటా ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు ‘శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రయిజ్’ పేరిట అవార్డులిస్తున్నారు. ఈ ఆవార్డు శాస్త్ర వైజ్ఞానిక రంగాలలో ఎంతో గౌరవప్రదమైంది.
శాంతి స్వరూప్ భట్నాగర్ పాకిస్థాన్లోని షాపూర్లో పుట్టాడు. తల్లిగారి తండ్రి అంటే తాతగారైన ప్యారేలాల్ పోషణలో బులంద్ షహర్ : సికింద్రాబాద్ – ఉత్తరప్రదేశ్లో పెరిగాడు. ఆ తాతగారు ఆ రోజుల్లో రైల్వే ఇంజనీర్గా పనిచేసేవారు. శాంతి స్వరూప్ తల్లి పార్వతి; తండ్రి పరమేశ్వర్ సహారు. వంశపారంపర్యంగా వస్తున్న ఇంటిపేరు సహారుని వదిలేసి – హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మతాలకు దూరంగా వెళ్ళి కాయస్తులలో చేరి, శాంతి స్వరూప్ భట్నాగర్గా మారాడు. చిన్నతనంలో శాంతి స్వరూప్లో వైజ్ఞానిక జిజ్ఞాసను పెంచింది ఆ తాత గారే. ఆయన శిక్షణలో శాంతికి సాహిత్య, నాటక, సాంస్కృతిక, సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో మంచి అభిరుచి కలిగింది. శాంతి స్వరూప్ తన తండ్రి సహాధ్యాయి అయిన లాలా రఘునాథ్ సహారు దష్టిలో పడ్డాడు. ఆయన దయాల్ సింగ్ హైస్కూలుకు హెడ్మాస్టర్గా ఉండేవాడు. స్వయంగా వెళ్ళి, శాంతి స్వరూప్ తల్లితోనూ, తాతతోనూ మాట్లాడి శాంతి చదువుకు సంబంధించిన బరువు బాధ్యతల్ని తనకు అప్పగించవల్సిందిగా కోరాడు. తన మిత్రుడు పరమేశ్వర్ సహాయ ఆత్మశాంతి కోసమైనా తనకు ఆ బాధ్యత అప్పగించాలని మరి మరి ప్రాధేయపడ్డాడు. వారికి అంగీకరించక తప్పలేదు. ఆ విధంగా హెడ్మాస్టర్ లాలా రఘునాథ్, శాంతి స్వరూప్ను సొంత బిడ్డలా చూసుకుని పెంచి పెద్ద చేశాడు. అయితే శాంతి, రఘునాథ్పై భారం వేయలేదు. ప్రభుత్వ విద్యార్థి వేతనం సంపాదించుకున్నాడు. అక్కడి సైన్స్ ఉపాధ్యాయుడు మౌల్వీ తాలిబ్ అలీ ఎబంద్ పోత్సాహంతో అద్భుతాలు చేసి చూపాడు. ప్లాస్క్లు, టెలిఫోన్లు, కాలింగ్ బెల్లు, స్టీమ్ ఇంజన్ల వంటి పరికరాలు తయారుచేస్తూ, ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆ విధంగా విద్యార్థులందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడు.
శాంతి స్వరూప్ భట్నాగర్ డిగ్రీ చదివాడు. కానీ, పరీక్ష తప్పాడు. మరోవైపు అప్పటికే పెద్ద వాళ్ళు పెండ్లి చేశారు. డిగ్రీ పూర్తి కాలేదు. ఉద్యోగం లేదు. ఆ స్థితిలో ఆదుకునే వాళ్ళు లేరు. భారతదేశంలోని సగటు యువకులు చాలా మంది అలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నవే. అలాంటి స్ధితిలో ధైర్యంగా నిలబడి, ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదగడమంటే – అతనిలోని పట్టుదల, కృషి, నిజాయితీ, నిబద్దత ఏ పాటిదో అర్ధం చేసుకోవాలి. వాటి నుండే నేటి యువత స్ఫూర్తి పొందాలి. ఆ దశలో ప్రయివేట్గా ట్యూషన్లు చెప్పుకుంటూ శాంతి స్వరూప్ బి.యస్సీ పాసయ్యాడు. ఆ తర్వాత ఫోర్మెన్ కాలేజిలో డెమానిస్ట్రేటర్గా ఉద్యోగం సంపాదించాడు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ ప్రయివేట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ జి.యం. బినాడే దగ్గర ఎన్రోల్ అయ్యాడు. ”ద ఎఫెక్ట్ ఆఫ్ అబ్సార్బడ్ గ్లాస్ ఆన్ ద సర్ఫేస్ ‘టెన్సన్ ఆఫ్ వాటర్ – అనే అంశం పై డిజర్టేషన్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా సాధించాడు. శాంతి స్వరూప్, తన విదార్థులందరిలోకి తలమానికమైన వాడని ప్రొఫెసర్ బినాడే ఎంతో గొప్పగా చెప్పుకునేవాడు.
ఆ వెనువెంటనే దయాల్ సింగ్ స్కాలర్షిప్తోనూ, తన భార్య లాజవంతి నగలు అమ్మిన డబ్బుతోనూ 1919లో భట్నాగర్ లండన్ బయలుదేరి వెళ్ళాడు. యూనివర్సిటీ కాలేజిలోని రామ్సే లెబోరెటరీలో డైరెక్టర్ డొన్నాస్ ఆధ్వర్యంలో సర్ఫేస్ టెన్షన్పై పరిశోధనలు సాగించాడు. ‘ఇన్వెన్షన్స్ ఆఫ్ ఎమల్షన్స్’ అనే విషయంపై 1921లో డి.ఎస్సి పట్టా పొందాడు. అదే సమయంలో సి.వి.రామన్, జె.సి.బోస్, పి.సి.రే మొదలైన వాళ్ళంతా అక్కడే లండన్లో ఉన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) వాళ్ళు వీళ్ళందరినీ సంప్రదించి, చివరకు శాంత స్వరూప్ భట్నాగర్కు ఫిజికల్ కెమిస్ట్రీ అధ్యాపకునిగా స్వదేశం తిరిగి రమ్మని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించి భట్నాగర్ తిరిగి రావడమే కాదు, బీహెచ్యూలోని ప్రయోగశాలల్ని మరింతగా అభివద్ధి చేశాడు. 1923లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రతినిధిగా లివర్పూల్లో జరిగిన బ్రిటీష్ అసోసియేషన్ సమావేశాలకు హాజరైన శాంతి స్వరూప్, అక్కడ ‘నేచర్’ పత్రికలో అచ్చయిన ప్రకటన చూశాడు. లాహోర్లోని కెమికల్ లెబొరెటరీస్కు డైరెక్టర్ పదవి కోసం ఆ ప్రకటన ఇవ్వబడింది. దానికి ప్రొ.విల్స్డెన్తో పాటు భట్నాగర్ కూడా అప్లరు చేశాడు. ప్రొ. విల్స్డెన్కు ఆ పదవి దక్కాలని, భట్నాగర్ విరమణకు పెద్ద ఎత్తున ఒత్తిళ్ళు వచ్చాయి. భట్నాగర్ పోటీ నుంచి తప్పుకోలేదు. చివరకు ప్రొ. విల్స్డెన్ ప్రయత్నాలు మానుకుని వెళ్ళిపోయాడు. దేశం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు బ్రిటీష్ ప్రొఫెసర్ను పంపించి, ఒక భారతీయ శాస్త్రవేత్త ఆత్మ స్థైర్యంతో నిలబడి డైరెక్టర్ పదవి సాధించడమన్నది మామూలు విషయం కాదు – భట్నాగర్ మామూలు వాడు కాదన్నది రుజువైంది!
1942 సెప్టెంబర్లో భట్నాగర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు రూపకల్పన చేశాడు. త్వరిత గతిన దేశం పారిశ్రామికంగా ఎంతో పురోగతి సాధించింది. ఒకవైపు టాటా స్టీల్ వారు సర్జికల్ స్టీల్ తయారు చేయసాగారు. మరో వైపు టెక్స్టైల్ మిషనరీ ఇండిస్టీ, ఇంకోవైపు షుగర్ ఇండిస్టీ శాఖలు శాఖలుగా పెరిగిపోయాయి. నేషనల్ ఫిజికల్, కెమికల్, మెటలర్జికల్, గ్లాస్, ప్యూయెల్, బిల్డింగ్ రోడ్, లెదర్, ఎలక్ట్రో కెమికల్, డ్రగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మొదలైన వివిధ రంగాలకు చెందిన జాతీయ పరిశోధనాశాలలకు భట్నాగర్ రూపకల్పన చేసి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశానికి ఒక విశిష్ట స్థానాన్ని కల్పించాడు. స్వాతంత్య్రం లభించకముందే దేశ అవసరాల్ని గుర్తించి, దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉండగా ఇన్ని పరిశోధనాశాలలకు అనుమతి సంపాదించడమంటే, ఎంత క్లిష్టమైనపనో చెప్పడం కష్టం.
సీఎస్ఐఆర్ను నెలకొల్పడంలో భట్నాగర్కు జె.సి.ఘోష్, జె.యం.ముఖర్జీ, మేఘనాథ్ సాహా, యస్.కె. మిత్ర, నాజర్ అహ్మద్ మొదలైన భారతీయ శాస్త్రవేత్తలంతా సహకరించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు సీయస్ఐఆర్కు శాంతి స్వరూప్ భట్నాగర్ అధ్యక్షుడిగా ఉన్నాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దానికి అధ్యక్షుడయ్యాడు. భట్నాగర్ సెక్రటరీగా పని చేశాడు. ఆ తరువాత సీయస్ఐఆర్ – నలభై శాఖలుగా విస్తరిల్లింది. ఆరువేల మంది శాస్త్రవేత్తలతో 13 వేల మంది సాంకేతిక నిపుణులతో, మరో ఆరువేల ఇతర ఉద్యోగులతో స్థిరపడి ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. వందల కోట్ల నిధులతో అది ఒక పెద్ద సంస్థగా రూపుదిద్దుకుంది. ఆస్ట్రో ఫిజిక్స్ నుండి ఆంటీబయాటిక్స్ దాకా – కంప్యూటర్స్ నుండి కెటలిస్ట్లదాకా వివిధ రంగాలలో జరిగే పరిశోధనలకు సీఎస్ఐఆర్ ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది.
భట్నాగర్ సమయస్ఫూర్తి గురించి ఎంతో మంది ఎన్నో విషయాలు చెపుతుంటారు. ఒకసారి లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బిల్డింగ్స్ తయారయ్యాయి. హడావుడిగా ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు. బిల్డింగ్లో ఎక్కడా ఏమీ లేవు. వెంటనే ఆయన మ్యూజియం వాళ్ళని అడిగి జంతువుల మోడల్స్ (ూుఖఖీఖీజుణ Aచీ×వీAూ వీఉణజుూూ) తెప్పించి, వాటిని అందంగా భవనమంతా అమర్చమన్నాడు. అంతే. ఆ అమరిక కొత్త భవనానికి వింత శోభనిచ్చింది. అది జంతు చర్మాలపై పరిశోధనలు చేసే సంస్థ గనక, ఆ అమరిక అందరికీ నచ్చింది. ఆకట్టుకుంది కూడా! మరోసారి కర్రికుడి ఇనిస్టిట్యూట్ విషయంలో అలాగే జరిగింది. ఆ సంస్థ చుట్టుపక్కల ఏ పట్టణమూ లేదు. కనీసావసరాలూ లేవు. అంతటి మారుమూల పల్లెలో జాతీయ సంస్థ నెలకొల్పడమేమిటని కొందరు రాజకీయం చేద్దామనుకున్నారు. ప్రారంభోత్సవానికి ప్రధాని నెహ్రూ కూడా రాబోతున్న సందర్భం. భట్నాగర్ తెలివిగా పరిస్థితుల్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. అధైర్య పడలేదు. ప్రధాని నెహ్రూ మదరాసులో విమానం దిగి కర్రికుడి వచ్చే దారిలో వంద టాక్సీలు ఏర్పాటుచేశాడు. వారు చేయాల్సింది ఏమీ లేదు. దినమంతా ఆ దారిలో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరుగుతూ ఉండాలి. అంతే! ఆ ఉపాయం బాగా పనిచేసింది. దారి పొడవునా కార్ల రాకపోకలు చూసిన నెహ్రూజీకి అదొక మారుమూల ప్రదేశమన్న ఆలోచనే రాలేదు. వంద టాక్సీ కార్లతో ఆ ప్రాంతమంతా పట్టణ ప్రాంతమన్న భ్రాంతిని కలిగించాడు – భట్నాగర్! ఆ సంస్థ ప్రారంభమయ్యాక క్రమ క్రమంగా ఆ ప్రాంతం దానంతట అదే అభివద్ది అయ్యింది.
జటిలమైన సమస్యలకు సుళువైన మార్గాలు అన్వేషించడంలో శాంతి స్వరూప్ భట్నాగర్ది అందెవేసిన చేయి. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. యుద్ధానికి కావల్సిన పరికరాల్ని ‘గ్రూప్ సప్లరు కౌన్సిల్’ అందిస్తూ ఉండేది. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు హెలికాఫ్టర్ నుంచి యుద్ధం జరిగే ప్రదేశాలలో జార విడిచేందుకు తగిన డబ్బాలు అవసరమయ్యాయి. రేకు డబ్బాలకు ప్రత్యామ్నాయంగా మరేవైనా ఉంటే బావుండునని తర్జన భర్జన పడుతున్న సమయంలో, ఆ సమస్యను శాంతి స్వరూప్ ముందుంచారు. పాలిమర్ కెమిస్ట్రీ మీద మంచి పట్టు ఉన్న వాడు కాబట్టి, తన ప్రయోగశాలలో ప్లాస్టిక్ డబ్బా (కంటెయినర్) తయారుచేశాడు. ఆ రోజుల్లో సీయస్ఐఆర్ ప్రయోగశాల ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉండేది. భట్నాగర్ అక్కడి నార్త్ బ్లాక్ బిల్డింగ్ పైకి వెళ్ళి, కొన్ని వందల మంది సమక్షంలో తన చేతితో – ఆ ప్లాస్టిక్ డబ్బాను బలంగా కిందికి విసిరేశాడు. డబ్బా గానీ, అందులోని నీరుగానీ చెక్కు చెదరలేదు. ప్లాస్టిక్ డబ్బాల వాడకం ఈనాడు మనకు వింత కాదు. కానీ, ఆనాడు ఆయన అలా యుద్ధం కోసం ప్లాస్టిక్ను వాడుకలోకి తెచ్చాడు. అటు యుద్ధ భూమి నుండి ఇటు సామాన్య జన జీవితం వరకు పరిశోధనలు ఉపయోగకరంగా ఉండాలన్నది భట్నాగర్ అభిమతం ! ఆశయం!!
ఒకవైపు అనారోగ్యం, మరో వైపు పని ఒత్తిడి.. భట్నాగర్కు విశ్రాంతి దొరికేది కాదు. విధి నిర్వహణలోనే ఆనందం పొందేవాడు. చివరకు ఒకసారి డార్జిలింగ్లోని హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ సంస్థను సందర్శించడానికి వెళ్ళి, అక్కడే గుండెపోటుతో మరణించాడు. ఆరోజు 1 జనవరి 1955. ప్రధాని నెహ్రూతో పాటు నాటి కేంద్ర మంత్రివర్గమంతా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించింది. ”బిల్డర్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్” – అని నెహ్రూజీ ప్రశంసించాడు. కాలాన్ని గౌరవిస్తూ విధి నిర్వహణకు అత్యంత ప్రాధానమిచ్చిన శాస్త్రవేత్త- డా. శాంతి స్వరూప్ భట్నాగర్, ఒక వైజ్ఞానిక రత్నం!
త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత
– డాక్టర్ దేవరాజు మహారాజు
భారతీయ వైజ్ఞానిక పరిశోధనాశాలల పితామహుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES