• వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్
• ఎరువుల విక్రయాలకు ప్రిన్సిపల్ సర్టిఫికెట్ లైసెన్స్ తప్పనిసరి
నవతెలంగాణ – పెద్దవంగర: విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో ఫర్టిలైజర్ డీలర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. అవుతాపురం, పోచంపల్లి, పెద్దవంగర గ్రామాల్లోని పలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల షాపులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్స్, స్టాక్ బోర్డు, ధరల పట్టిక, ప్రిన్సిపల్ సర్టిఫికెట్, పలు రిజిస్టర్ లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏవో మాట్లాడుతూ.. లైసెన్స్లు, స్టాక్ బోర్డు, ధరల పట్టికలు ప్రతి షాపులో ఏర్పాటు చేయాలని డీలర్లకు సూచించారు. రైతులకు సంతకం చేసిన బిల్లులను ఇవ్వాలని, కాలపరిమితి దాటిన సరుకులను ఉంచరాదని సూచించారు. ఎరువులు, విత్తన నిల్వలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. విత్తనాలకు ఇన్వాయిస్ కాపీ ప్రిన్సిపల్ సర్టిఫికెట్ లైసెన్స్ లేకుండా విక్రయించరాదన్నారు. లూజ్ విత్తనాలను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. నిబంధనలను పాటించని వారిపై శాఖ పరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏఈవోలు పాల్గొన్నారు.