నవతెలంగాణ-హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున బయలుదేరడంతో.. శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, భాగ్యలత, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఫలితంగా, కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుగా నిలిచి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి నెలకొంది.
మరోవైపు, ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. పండగ రద్దీ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోయారు. ఈ ఊహించని ట్రాఫిక్ జామ్తో గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని, ఇంతటి రద్దీని అంచనా వేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్లో ట్రాఫిక్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.