మనం నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలకంటే ఎకువగా చమత్కారాలకు, మాయలకు, మంత్రాలకు ఆకర్షింపబడుతున్నాం. అందుకే చూడండి. దేశ జనాభాలో వైజ్ఞానిక భావనల్ని తగ్గించడానికి, దొంగ బాబాలు, దొంగ స్వాములు, కపట రాజకీయ నాయకులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అందరికం దరూ బలిసిపోతున్నారు. ఇందుకు కారణం దేశ ప్రజల మూఢత్వం ఒక కారణం కాదా? తమ శక్తి తాము గ్రహించుకోలేక, తమ మెదళ్లను తాము ఉపయోగించుకోక నిస్సత్తువగా, నిరాశలో బతుకీడుస్తున్నవారు ఈ దేశవాసులు కాదా? కొందరు తెలివిలేని వాళ్లయితే అతి తెలివితో ఆగమైపోతున్నవారు మరికొందరు – అవునా కాదా? ఆలోచించి చూడండి.
చదువూ, ఉద్యోగం లేని వాడొకడు విసిగిపోయి ఏదో బాబాగా మారి చెట్టు కింద కూర్చుంటే, జనమంతా అతని చుట్టూ చేరి తమకు ఉద్యోగం రావాలని, చదువు రావాలని – అనుగ్రహించమన్నారట! మన దేశంలో పరిస్థితి ఇదిగో ఇలా ఉంది. బాబాలకు అతీంద్రియ శక్తులుంటే వాళ్లు జైళ్లకు ఎందుకు వెళ్లేవారు? వెళ్లినా, తమ శక్తి ఉపయోగించి బయటపడాలి కదా? వారికి శక్తులున్నాయన్న విషయం నిరూపించబడేది? గుడ్డిగా నమ్మే మూఢ భక్తులు ఇలాంటి చిన్న విషయం కూడా ఆలోచించరెం దుకనీ? మూర్ఖంగా దొంగ బాబాల చుట్టూ తిరిగి, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే ఎంత బావుండునూ? జనంలో వివేకం పెరిగితే, దేశంలో దొంగ బాబాలు తగ్గిపోతారు. వారికి రాజకీయ నాయకులతో బంధం తెగిపోతే, పరిపాలన బాగుపడుతుంది. పరిపాలన బాగుపడితే, ప్రజలు కొంత మేర ప్రశాంతంగా బతకగలరు. కానీ, ప్రజల శాంతిని కొల్లగొట్టడమే దొంగాబాబా, కపట రాజకీయ నాయకులూ కోరుకుంటున్నారు. ఇవన్నీ చాప కింది నీరులా మనువాద ప్రభావంతో సాగుతున్న కార్యక్రమాలు.
”పుస్తకాలు చదవని వారు బతికి ఉండగానే చచ్చిపోతారు. పుస్తకాలు చదవండి! అవే మిమ్మల్ని రక్షిస్తాయి. మిమ్మల్ని చరిత్ర కారులుగా మారుస్తాయి. మీకు రాజ్యాధికారం తెచ్చి పెడతాయి. మీ బానిస సంకెళ్లను తెంపేస్తాయి. నా అక్షరాలలో విముక్తి సూత్రాలున్నాయి. తూటాలు, కత్తులు, గొడ్డళ్లు కూడా ఉన్నాయి. నా స్వప్నం, నా లక్ష్యం, మిమ్మల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయడమే. లేచి, ముందు మీ ఇంటిని గ్రంథాలయంగా మార్చుకోండి! జ్ఞానవం తులు కండి !! అబద్దపు బతుకులు బతుకుతూ, అమ్ముడుపోతూ, అధికారం కావాలని మనువాదులకు భజనలు చేయకండి! మీరేమిటో, మీశక్తేమిటో మీరు తెలుసుకోండి”.
ఇది డా.బి.ఆర్.అంబేద్కర్ తన జాతి జనులకు అందించిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనం ప్రతిదాన్నీ ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించు కోవాలి. అంబేద్కర్ వాదులమని చెప్పుకునేవారమైనా అంబేద్కర్ స్ఫూర్తితో నడవాలి కదా? అంబేద్కర్ నుంచి స్ఫూర్తిని పొందడమంటే ఆయనలాగా పుస్తకాలు చదవాలి కదా? సమాజ స్వరూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి కదా? విశ్లేషించు కుంటూ ఉండాలి కదా ? మనంసంప్రదాయ-సనాతన వాదుల్నీ, మనువాదుల్ని వ్యతిరేకిస్తున్నామా? పరిశీలించుకోవాలి.
”నేనేమో మీ గురించి ఎన్నో కలలు కన్నాను. మీరేమో ఇలా అయిపోయారు” అని అంబేద్కర్ ఆయన బతికి ఉన్నరోజుల్లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి మనకు తెలియనిది కాదు. పొద్దున లేస్తే గుళ్ల చుట్టు ప్రదక్షిణలు చేసేది, వ్రతాలు, నోములూ పాటించేది, దొంగ బాబాలను, స్వాములను నమ్ముకుని వారి వెంట పడుతున్నది, అగ్రవర్ణ నాయకుల – ఆర్థిక ఆధిపత్యం గల రాజకీయ వేత్తల మోసపు మాటలకు మోసపోతున్నది ఎవరూ? అధిక సంఖ్యాకులైన బలహీనవర్గాల ప్రజలు కాదా? బలహీన వర్గాల పౌరులందరూ చైతన్యవంతులై సమాజాన్ని సమూలంగా మార్చాల్సి ఉంది. శతాబ్దాలుగా సమాజాన్ని శాసిస్తున్న మనువాద సిద్ధాంతాల్ని – ఆచార వ్యవహారాల్ని పక్కకు తోసి, వైజ్ఞానికంగా మనమేమిటో, మన మూలాలేమిటో తెలుసుకోవాల్సి ఉంది. లేకపోతే, బానిసత్వానికి అలవాటు పడ్డ మనిషి, ఇక అదే జీవితమను కుంటాడు. తన శక్తిసామర్థ్యాలు పూర్తిగా మరిచిపోతాడు.
తమిళనాడు శివగంగై జిల్లా మానా మదురైకి చెందిన దళిత యువకుడు స్థానిక ప్రభుత్వ కళాశాలలో మూడో సంవత్సరం – డిగ్రీ చదువుతున్నాడు. ఆ కుర్రవాడికి బుల్లెట్ మోటారు సైకిల్ ఉండడం ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు నచ్చలేదు. అతని మీద కోపం పెంచుకున్నారు. యధావిధిగా ఒక రోజు ఆ దళిత విద్యార్థి క్లాసులు అయిపోయాక తన బుల్లెట్ బైక్పై ఇంటికి బయలుదేరాడు. అసూయతో రగిలిపోతున్న ఇతర విద్యార్థులు అడ్డంగా నిలబడి అతన్ని అడ్డుకున్నారు. ”షెడ్యూల్ కులంలో పుట్టినవాడివి నువ్వు బుల్లెట్ బండి నడుపుతావా?” – అని కింద పడేసి రెండు చేతులూ నరికేశారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి విధ్వంసం సష్టించారు. ఆ ఘటనలో చేతులు కోల్పొయిన దళిత విద్యార్థికి స్మాన్ని రాజాజి ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేసి, అతని చేతులు అతికించారు. దాడి చేసిన ఇతర విద్యార్థుల మీద పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దళితుడు దర్జాగా గుర్రమెక్కి బ్యాండు మేళంతో పెండ్లి చేసుకుంటున్నాడని, ఆగ్రవర్ణం వారు దాడి చేసి కొట్టి చంపిన సంఘటనలు ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివే కాకుండా ఇటీవల మరొక విచిత్రమైన సంఘటన జరిగింది.
అగ్రవర్ణం వాడొకడు తన కుక్కను తీసుకుని రోడ్డుమీద నడుస్తూ ఉన్నాడు. కొద్ది దూరంలో తన గుడిసె ముందు కూచుని దళితుడొకడు తన రొట్టె తింటున్నాడు. రొట్టె వాసన పసిగట్టిందేమో కుక్క తన యజమానిని వదిలేసి, పరిగెత్తి దళితుడి ముందు నిలుచుంది. రొట్టె కోసం వచ్చిందేమో పాపం! మూగప్రాణి అనుకుని, ఆ దళితుడు చిన్నరొటె ముక్క కుక్కకు వేశాడు, కుక్క గబుక్కున అందుకుని తినేసింది, ఇదంతా చూస్తున్న అగ్రవర్ణం వాడు వేగంగా దగ్గరి కొచ్చి పెద్దగా అరిచాడు. ” ఏరా! కండ్లు మూసుకు పోయాయా? అది ఎవరి కుక్క అనుకుని రొట్టెవేశావూ? ఇప్పుడు నీరొట్టె తిని నా కుక్క మైల పడింది. పరిహారమేమిటీ? జరిమానా కడతావా?” అని బెదిరించాడు. ఫోన్చేసి తన వాళ్లను ఐదారుగుర్ని పిలిచి, అక్కడే పంచాయతీ పెట్టాడు. వాళ్లంతా మంతనాలు జరిపి – దళితుడు పదివేలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. లేకపోతే అక్కడి నుంచి గుడిసెనే ఎత్తేయిస్తామని బెదిరించారు. ”అయ్యా నాదే తప్పు మన్నించండి. అప్పో సప్పా తెచ్చి కడతాలెండయ్యా ! కొంచెం సమయమిప్పించండి” అని కాళ్ల వేళ్ల పడి వేడుకున్నాడు దళితుడు.
మూర్ఖులు సామాన్య పౌరుల్లొన్నే కాదు, ఉన్నత పదవుల్లో ఉన్నవారిలో కూడా ఉన్నారు. ”ఆడ నెమలి మగ నెమలితో శారీరకంగా కలవదు. మగ నెమలి కన్నీళ్లు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుంది” – అని అన్నాడొక జడ్జి గారు. ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలన్నది ఈయనే! ప్రవచన కారులు చెపితే, హాఫ్ నాలెడ్జ్ గాళ్లు – ఏదో వాగుతుంటారులే అని అనుకుంటాం! కానీ, జడ్జి పదవిలో ఉన్నవారే ఇలా చెబితే ఇక ఏం మాట్లాడతాం? ”అయ్యా.. ఆ పదవిలోంచి దిగిపో. వెళ్లి ప్రవచనాలు చెప్పుకుని బతుకు’ అని అంటాం- ఇతను ‘శర్మ’ కాబట్టి అలా చెప్పాడని అనుకుందాం.
మరి యాదవ్కు ఏమైంది? ఇతనెందుకు మనువాదులకు భజన చేస్తున్నారూ? ఆ శర్మ కంటే ఈ యాదవ్ మరో నాలుగాకులు ఎక్కువ చదివినట్లున్నాడు. ఈ యాదవ్గారు అలహాబాదు హైకోర్టులో పనిచేసిన వారు. ఆయన చెప్పిన విషయం ఏ శాస్త్రజ్ఞుడికీ తెలియదు. ఆవు-అక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలేస్తుందీ అన్నాడు. అంతేకాదు, యజ్ఞంలో ఆవు నెయ్యి వేయడం వల్ల – సూర్య కిరణాలకు ప్రత్యేకమైన ఎనర్జీ వస్తుంది. దాని వల్ల వర్షాలు బాగా పడతాయీ -అని అన్నాడు. అంతేకాదు, ఆవు నెయ్యి, పెరుగు, మూత్రం, పేడ మొండి రోగాలను నయం చేస్తాయి- అని కూడా అన్నాడు.
ఇవన్నీ అలవోకగా ఏదో ఒక ఉపన్యాసంలో చెప్పడం కాదు, జడ్జిగా తీర్పునిస్తూ, తన 12 పేజీల హిందీలో రాసిన జడ్జిమెంట్ నమోదు చేశాడు. సంభల్ ప్రాంతంలో ఆవును చంపిన వాడికి బెయిల్ ఇవ్వాల్సిన తీర్పులో ఈ జడ్జిగారు పై విషయాలన్నీ స్పష్టంగా రాశాడు. వైజ్ఞానిక స్పహతోనే ఈ దేశం ముందుకు పోతుంది’ – అని కలలుగన్న పండిట్ నెహ్రూ కలల్ని బద్దలు కొడుతూ ఇదిగో ఇలా-మనువాదులకు భజనాలు చేసే బహుజనులు, దళితులు తయారయ్యారు. బాగా చదువుకుని, విద్యావంతులైన వారు సమాజంలోని అంధ విశ్వాసాలతో పోరాడకుండా, తమతోటి వారిని మూఢత్వంలోంచి బయటికి లాగకుండా, నిర్లిప్తంగా ఉంటే- వారి చదువుకు అర్థమే లేదు! విద్యా విహీనులకూ వీరికీ పెద్ద తేడాయే ఉండదు!!
కవిరాజు: త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలి గ్రహీత.
– డాక్టర్ దేవరాజు మహారాజు
ముందు మనువాదాన్ని మట్టుబెట్టండి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES