గత నెలలో ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలు ప్రకటించేందుకు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వేదికపైకి వచ్చినప్పుడు దేశం యావత్తు గర్వపడింది. ఇద్దరు మహిళా అధికారులు ఇలాంటి గొప్ప బాధ్యతను నిర్వర్తించడంతో దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు అలాంటిదే మరో గొప్ప మార్పు జరిగింది. మే 9న లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకీ భారత రాష్ట్రపతికి సహాయకురాలి (ఏడీసీ-ఎయిడ్-డి- క్యాంప్)గా నియమించబడ్డారు. ఈ బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ బాధ్యతలు చేపట్టిన ఆమె సమాజంలోని మరో గాజు పైకప్పును బద్దలు కొట్టారు.
ఈ చారిత్రాత్మక నియామకం కేవలం ఆమె వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. అంతకు మించే ఉంది. భారతదేశ సాయుధ దళాలలో లింగ సమానత్వానికి ఓ ముందడుగుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే భారత సైన్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో చేరేందుకు ఒక మార్గం. ప్రస్తుతం ఆమె పోషిస్తున్న పాత్ర అపారమైన గౌరవం, బాధ్యతతో కూడుకున్నది. ఏడీసీలు రాష్ట్రపతికి వ్యక్తిగత సిబ్బంది అధికారులుగా వ్యవహరిస్తారు. వారికి అవసరమైన కమ్యూనికేషన్ను జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు, ప్రోటోకాల్ను నిర్ధారిస్తారు. అలాగే రాష్ట్రపతి పాల్గొనవల్సిన రోజువారీ ప్రోగ్రామ్లు, పనులు, విధులకు సహాయం చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతికి ఐదుగురు ఏడీసీలు సేవలు అందిస్తారు. వారిలో సైన్యం నుండి ముగ్గురు, నేవీ నుండి ఒకరు, వైమానిక దళం నుండి ఒకరు ఉంటారు.
సవాళ్లతో కూడిన బాధ్యతల్లో
లెఫ్టినెంట్ కమాండర్ సోలంకి ఇన్నేండ్ల తర్వాత మొదటి సారి ఈ ఉన్నతమైన పదవికి ఎంపిక కావడంతో పురుషాధిక్య సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను బద్దలు కొట్టినట్టుగా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా స్త్రీ – పురుష బేధం కంటే వారిలోని టాలెంట్ను గుర్తించడంలో భారత నావికాదళం చూపిన నిబద్ధతకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. సోలంకి సాధించిన ఈ విజయం భారత సాయుధ దళాలలో విస్తృతమైన మార్పులో ఓ భాగం. భారత నావికాదళంలో ఇటీవల కాలంలో మహిళలకు నాయకత్వం, పోరాటంతో పాటు సవాళ్లతో కూడిన బాధ్యతలను ఎక్కువగా అప్పగిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది మహిళా అధికారులను గవర్నర్లు, ఆర్మీ కమాండర్లు, సర్వీస్ చీఫ్లకు ఏడీసీలుగా నియమించారు. ఈ నియామకం భారత నావికాదళ ప్రగతిశీల పురోగతిలో మరో గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు.
మధ్య వారధిగా…
రాష్ట్రపతి ఏడీసీగా ఆమె పాత్ర కేవలం గొప్పగా చెప్పుకోవడానికే కాదు. ఇది ఆమెను దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ కార్యాలయంలో ప్రధాన స్థానంలో ఉంచుతుంది. అలాగే సైనిక ప్రోటోకాల్లో రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవి మధ్య వారధిగా పనిచేస్తుంది. రక్షణ సేవలలో ఒక ప్రధాన నిర్మాణాత్మక మార్పు నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జనవరి 2025 నుండి ఎడీసీలు వారి సొంత రంగంలో మాత్రమే పనిచేసే పద్దతిని సవరించారు. ఇప్పుడు, వ్యక్తిగత సిబ్బంది అధికారులు నుండి సైన్యం, నేవీ, వైమానిక దళ చీఫ్లు సోదర రంగాల నుండి రావచ్చు. ఇది భారతదేశ ఏకీకృత, పరస్పరం పనిచేయగల సాయుధ దళ దృష్టిని ప్రతిబింబిస్తుంది.
శక్తివంతమైన సందేశం
ఈ మార్పు భారతదేశపు మొట్టమొదటి రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలోని సంస్కరణలలో ప్రారంభమయింది. అప్పటి నుండి ఆయన వారసత్వం భారతదేశ సైనిక నాయకత్వ భవిష్యత్తును రూపొందిస్తూనే ఉంది. యశస్వి సోలంకి ప్రయాణం ఇప్పుడు ప్రతిభ, క్రమశిక్షణ ఉంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని తామేంటో నిరూపించుకోవచ్చని గుర్తు చేస్తోంది. అంతేకాదు భారత రక్షణ రంగాన్ని క్రమంగా పునర్నిర్మిస్తున్న అనేక మంది మహిళా అధికారులతో పాటు ఆమె పేరు కూడా చెక్కబడుతుంది. రాష్ట్రపతి ఏడీసీగా రాష్ట్రపతి భవన్లో ఇప్పుడు ఆమె ఉనికి, యూనిఫాంలో ఉన్న ప్రతి మహిళకు ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. సమాజంలో ఏ పాత్ర మహిళలు అందుకోలేనిది కాదు. ఏ ఆశయం కూడా మహిళలు చేరుకోలేనిది కాదని నిరూపిస్తోంది. నావికాదళం గర్వంగా రెపరెపలాడుతుండగా లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి నేవీ అధికారిగా మాత్రమే కాకుండా మొత్తం భారతీయ మహిళలకు పురోగతికి దారిచూపే దీపస్తంభంగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆమె గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాదు ఒక గొప్ప చరిత్రనే సృష్టించింది.
మొదటి మహిళా ఏడీసీ యశస్వి సోలంకి
- Advertisement -
- Advertisement -