నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం ముగియడంతో గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను పునద్ధరిస్తున్నట్లు ఎయిరిండియా మంగళవారం వెల్లడించింది. యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను యథవిధిగా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. యూరప్, కెనడా వెళ్లే మార్గాల్లో పలు విమానాల రాకపోకలు ఆలస్యం కానున్నాయని, ఆయా మార్గాల విమాన సర్వీసుల వివరాలు తమ వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులుకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఖతార్లోని అమెరికా ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇంతకుముందు ఎయిరిండియా ప్రకటించింది.
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకొని ఇరుదేశాలు క్షిపణులతో భీకరదాడులు చేసుకున్నాయి. శాంతి శాంతి అంటూ కొంగజపం చేసిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్.. అనుహ్యంగా ఇరాన్ లోని అణు స్థావరాలపై బాంబులతో దాడి చేసింది. ఈక్రమంలో అమెరికా దాడులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధాన్మాదం పెరిగిపోయింది. ఈక్రమంలో ఇరాన్ తోపాటు పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈనేఫథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా గల్ఫ్ మీద తమ ఎయిర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. తాజాగా ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణతో..రెండు దేశాల మధ్య వార్ కు బ్రేక్ పడింది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను భారత్ తోపాటు యూరప్ దేశాలు కూడా పునరుద్ధరించాయి.