నవతెలంగాణ-హైదరాబాద్: ఎడాతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు అసోంను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఎక్కడిక్కడా వరద నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వరదలకు పలువురు గల్లందు కాగా..కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందారు. వరద బాధితులను రక్షించడానికి ఆర్మీతోపాటు భద్రతా రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ ల సాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈక్రమంలో అస్సాంలోని ఖాజిరంగా జాతీయ పార్కులోకి కూడా వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం ఆపార్కులో వరద ఉధృతి కాస్తా తగ్గుముఖం పట్టింది. ఖాజిరంగాపార్క్తో పాటు టైగర్ రిజర్వ్లో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్ అరుణ్ విఘ్నేశ్ తెలిపారు. వరద నీటి ఉదృతి తగ్గుతోందని, పరిస్థితి అదుపులోకి వస్తోందని, అడవిలోని మృగాలు క్షేమంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఖాజిరంగా జాతీయ పార్కు ఖడ్గ మృగాలకు ఫేమస్. వాస్తవానికి ఇక్కడ ప్రతి ఏడాది వర్షాకాలంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉంటుంది. 2024లో వర్షాలు, వరదల వల్ల సుమారు 174 జంతువులు చనిపోయాయి. దాంట్లో 10 ఖడ్గ మృగాలు కూడా ఉన్నాయి. వార్షిక వరదలను ఎదుర్కొనేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. జాతీయ రహదారి 37 మార్గంలో కాన్వాయ్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వన్య మృగాలు సురక్షితంగా కర్బి అన్లాంగ్ కొండల్లోకి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
