నవతెలంగాణ-హైదరాబాద్: గతవారంరోజుల నుండి కురుస్తున్న భారీవర్షాలతో శ్రీలంక అతాలకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు ముంచెత్తడంతో సుమారు 20మంది మరణించినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. దీంతో మృతుల సంఖ్య 31కి చేరింది.
కొలంబోకు తూర్పున 300 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రావిన్స్లోని పర్వతప్రాంతాలైన బదుల్లా, నువారా ఎలియాలో 18 మంది మరణించినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం గురువారం తెలిపింది. ఇవే ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరో 14మంది గల్లంతైనట్లు వెల్లడించింది. వారాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు, పొలాలు, రహదారులను వరదలు ముంచెత్తాయి.
రాళ్లు, బురద మరియు చెట్లు పట్టాలపై పడటంతో రైల్వే వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. పలు ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను కూడా మూసివేశామని ప్రకటించారు. వర్షాలు, ప్రతికూల వాతావరణంతో సుమారు 4,000 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది.
శ్రీలంకలో సంభవించిన ఆకస్మిక విపత్తుపై భారత్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. వరద ముప్పు కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఆపద కాలంలో మిత్ర దేశం శ్రీలంకు సాయం చేయడానికి ముందు ఉంటామని ఎక్స్ వేదికగా ప్రకటించింది.



