Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంకడసారి చూపు కోసం..

కడసారి చూపు కోసం..

- Advertisement -

– ఆస్పత్రి వద్ద బంధువుల పడిగాపులు
– 32 మృతదేహాల గుర్తింపు
అహ్మదాబాద్‌:
విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆప్తులను కడసారి చూసుకునేందుకు అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రి వద్ద బంధువులు, స్నేహితులు పడిగాపులు కాస్తున్నారు. అలా నిరీక్షిస్తున్న వారిలో మిస్త్రీ జిగేష్‌ ఒకరు. గురువారం సాయంత్రం నుంచి జిగేష్‌, ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మృతుల్లో 22 ఏండ్ల జిగేష్‌ మేనకోడలు కూడా ఉన్నారు. డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన తర్వాతే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి అధికారులకు ఆయనకు చెప్పారు. అయితే అందుకు చాలా సమయం పట్టవచ్చునని, సంఘటనా స్థలంలో మృతదేహాల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని జిగేష్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. అలాంటప్పుడు డీఎన్‌ఏ పరీక్షలు ఎలా పూర్తవుతాయి? నా మేనకోడలి శరీర భాగాలు లభించకపోతే ఏం చేస్తారు? ఈ నిరీక్షణతో మా ప్రాణాలు పోతున్నాయి’ అని ఆయన చెప్పారు.
జిగేష్‌ ప్రశ్నలకు అధికారాలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది ఒక్క జిగేష్‌ ఆవేదన మాత్రమే కాదు.. ఆప్తులను కోల్పోయిన ఎందరో వ్యక్తులు ఆస్పత్రి వద్దే రాత్రింబవళ్లూ గడుపుతూ తమ వారి సమాచారం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. స్నేహితురాలిని కోల్పోయిన యువకుడిని, కుమార్తెలను కోల్పోయిన తండ్రిని…ఇలా ఎవరిని కదిలించినా కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. గుజరాత్‌లోని మెV్‌ాసానాకు చెందిన సంకేత్‌ గోస్వామి అనే యువకుడు విద్యాభ్యాసం కోసం లండన్‌ వెళుతూ ప్రమాదంలో మరణించాడు. అయితే అతను ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడని గోస్వామి తల్లికి సిబ్బంది చెప్పడంతో ఆమె మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. ముంబయికి చెందిన జావేద్‌ అలీ, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఇదే విమానంలో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయారు. తల్లితో కలిసి బక్రీద్‌ పండుగను జరుపుకునేందుకు వారు లండన్‌ నుంచి భారత్‌కు వచ్చారు. ఆ కుటుంబం తొలుత ముంబయి నుంచి అహ్మదాబాద్‌ వచ్చి లండన్‌ వెళ్లే విమానం ఎక్కింది.
కాగా మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా శనివారం నాటికి కేవలం 32 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. వైద్యులు మాత్రం సాధ్యమైనంత త్వరగా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను గుర్తించడం చాలా కష్టంగా ఉన్నదని అధికారులు చెప్పారు. కాలిపోయిన శరీర భాగాలు గుర్తించడానికి వీలులేని విధంగా ఉన్నాయి. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పొరబాటు జరిగే అవకాశమే లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాలిపోయిన శరీర భాగాల నుంచి దంత అవశేషాలు సేకరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్‌ఏ పరీక్షలు జరపడానికి మిగిలిపోయిన ఏకైక ఆధారం దంత అవశేషాలే. మృతదేహాల గుర్తింపు కోసం ఆస్పత్రి సిబ్బంది బంధువుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు.
ఆస్పత్రి వద్ద ఉన్న మృతుల బంధువుల్లో చాలా మంది మీడియాతో మాట్లాడేందుకు సుముఖత చూపడం లేదు. ఏది మిగిలినా తీసుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని వారు తొందర పడుతున్నారు. ఇప్పుడేమీ మాట్లాడే పరిస్థితిలో లేమని ఓ మహిళ తెలిపారు. డీఎన్‌ఏ నమూనాలు సేకరించిన 72 గంటలకు కానీ మృతదేహాలను గుర్తించడం సాధ్యం కాదు. సంఘటనా స్థలం నుంచి 274 మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చారని ఓ వార్తా సంస్థ తెలిపింది. శిథిలాలను తొలగిస్తుండగా ఎయిర్‌హోస్ట్రెస్‌కు చెందినదిగా భావిస్తున్న ఓ మృతదేహాన్ని కనుగొన్నారు.
రూపానీ డీఎన్‌ఏ మ్యాచ్‌ అయింది
సంఘటనా స్థలం నుంచి సేకరించిన అవశేషాలతో విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజరు రూపానీ డీఎన్‌ఏ మ్యాచ్‌ అయిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషీకేశ్‌ పటేల్‌ చెప్పారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆదివారం రూపానీ కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. రూపానీ కుమారుడు శనివారం అహ్మదాబాద్‌ చేరుకొని డీఎన్‌ఏ గుర్తింపు ప్రక్రియ కోసం రక్త నమూనాలు ఇచ్చారు. బీజే వైద్య కళాశాలలో ఆ ప్రక్రియను పూర్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -