నాలుగేండ్లలో 138 శాతం దరఖాస్తుల పెరుగుదల
అమెరికా, బ్రిటన్, రష్యా సహా 81 దేశాల అభ్యర్థుల దరఖాస్తులు
తిరువనంతపురం : మన దేశ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రయత్నిస్తుంటే… వివిధ దేశాల విద్యార్థులు కేరళ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు పోటీపడుతున్నారు. అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన తిరువనంతపురంలోని ఈ యూనివర్సిటీకి విదేశీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతోంది. విద్యా ప్రమాణాలతోపాటు విదేశీ విద్యార్థులకు అన్ని అంశాల్లోనూ ఇస్తున్న తోడ్పాటు దరఖాస్తుల పెరుగుదలకు తోడ్పడుతోంది. గత నాలుగేళ్లలో 138 శాతం పెరుగుదల నమోదైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 81 దేశాల నుంచి 2,620 మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2021-22లో 1,100 మంది, 2022-23లో 1400 మంది, 2024-25లో 2,600 మంది విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం 52 దేశాలకు చెందిన 205 మంది అంతర్జాతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో అమెరికా, బ్రిటన్, కొలంబియా, పెరూ తదితర దేశాల వారున్నారు.
కోర్సులకు డిమాండ్ ఇలా?
విద్యార్థుల్లో ఎక్కువ మంది కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ను ఎంపిక చేసుకున్నారు. ఆ తరువాత పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, భాషా శాస్త్రం (లింగ్విస్టిక్), ఇంగ్లీష్ లిటరేచర్కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటస్టిక్స్ వంటి కోర్సులకు కూడా దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తున్నాయి.
కేరళ విశ్వవిద్యాలయానికే విదేశీ విద్యార్థుల నుంచి అధిక దరఖాస్తులు : సీజీఏ డైరెక్టర్ సాబు జోసెఫ్
రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీలతో పోలిస్తే కేరళ విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల నుంచి అత్యధిక దరఖాస్తులు వస్తున్నాయని వర్సిటీలోని సెంటర్ ఫర్ గ్లోబల్ అకడమిక్స్ (సీజీఏ) డైరెక్టర్ సాబు జోసెఫ్ తెలిపారు. ఈ సంవత్సరం దరఖాస్తుల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లకు 1,265, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 1,020, పిహెచ్డి ప్రోగ్రామ్లకు 335 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది ఎంపిక కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ పోర్టల్కు పంపించినట్లు ఆయన తెలిపారు. అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, ఇరాన్, ఇరాక్, ఒమన్, సౌదీ అరేబియా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, దక్షిణాఫ్రికా తదితర దేశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా విద్యార్థులని చెప్పారు. విదేశీ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను, వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుకలను విశ్వవిద్యాలయం నిర్వహిస్తోందని తెలిపారు. విదేశీ విద్యార్థులను ఆదరిస్తూ ఇక్కడి వారితో కలిసిపోయేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విశ్వవిద్యాలయానికి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యతకు, విద్యా నైపుణ్యాలకు, సాంస్కృతిక వైవిధ్యం పట్ల ఉన్న నిబద్ధతకు ఈ దరఖాస్తుల పెరుగుదలే నిదర్శనమని అన్నారు.న
కేరళ విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల తాకిడి
- Advertisement -
- Advertisement -