Tuesday, June 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅడవీ అభివృద్ధి కావాలి

అడవీ అభివృద్ధి కావాలి

- Advertisement -

– ఆదివాసీల అభ్యున్నతికి అడ్డుగా అటవీ, అభయారణ్య చట్టాలు
– ఆ చట్టాలను పునర్వ్యవస్థీకరించాలి : మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మానవ మనుగడకు అడవీ, అడవితో పాటు అభివృద్ధి అవసరమని మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క అభిప్రాయపడ్డారు. అయితే ఆదివాసీల అభ్యున్నతికి అటవీ, అభయా రణ్య చట్టాలు తరచూ ఆటంకంగా మారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత చట్టాలను పునర్వ్య వస్థీకరిస్తేనే గిరిజనులు, ఆదివాసీలు, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని ఆదివా సీల కోసం ఉద్దేశించిన పథకాల లక్ష్యాలు నెరవేరుతాయని ఆమె వివరించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ”పీఎం జన్మన్‌, ధర్తి అబ జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష్‌ అభియాన్‌” పథకంపై సౌత్‌ ఈస్ట్‌ రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల గిరిజన సంక్షేమశా ఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఈ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, విద్య, వైద్యం, జీవనోపాధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం 17 శాఖలను సమన్వయం చేసే ప్రయత్నం బాగుందని అభినందిం చారు. 63,843 గ్రామాలు, 5 కోట్ల మంది ఎస్టీల కోసం ఏటా రూ.15,830 కోట్లను ఖర్చు చేసేందుకు కేంద్రం ముందుకు రావడాన్ని ఆమె స్వాగతిం చారు. ఇటీవల రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల అభివృద్ధి కోసం పలు శాఖలతో నిర్వహించిన సమీక్షల అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. గిరిజన జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ప్రజా సంఘాలతో చర్చించినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిస్తున్న చేయూతతో మైదాన ప్రాంతాల్లోని ఎస్టీలు అభివృద్ధి చెందుతున్నా… ఆదివాసీలు, ప్రిమిటివ్‌ ట్రైబ్స్‌ అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకంగా ఉన్న అభయారణ్య చట్టాలపై అటవీశాఖ అధికారులతో చర్చిస్తున్నా అభివృద్ధి ముందుకు సాగడం లేదని వెల్లడించారు. 1980కి ముందున్న గ్రామాల్లో అభివృద్ధికి అడ్డు చెప్పొద్దని అటవీ చట్టాలు చెబుతున్నా..కేంద్ర ప్రభుత్వం నుంచి చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్న భయంతో ఫారెస్టు అధికారులు అభివృద్ధి పనులు ముందుకు సాగనివ్వడం లేదని తెలిపారు. అభివృద్ధి వర్సెస్‌ అటవీ చట్టాలు అన్నట్టుగా పరిస్థితి మారిందని వివరించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగులో 77 శాతం అడవి ఉందనీ, అందుకే దాన్ని ట్రైబల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ తెలంగాణగా పిలుస్తారని చెప్పారు. అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన కనీసం మంచి నీటి సౌకర్యం, కనీస రోడ్లు వేయలేకపోతున్నట్టు తెలిపారు. గుడిసెల్లో ఉన్న పాఠశాలకు పక్కా భవనాలు నిర్మిద్దామనుకున్నా, అక్కడ అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు నిర్మిద్దామన్నా అటవీ అనుమతులు రావడం లేదని అన్నారు. దీంతో చేసేదేమి లేక తప్పనిసరి పరిస్థితుల్లో కంటైనర్‌ స్కూళ్లను, ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించేందుకు నూతన ఆలోచనతో తాత్కాలిక కంటైనర్లను సమ్మక్క- సారలమ్మ తాడ్వాయి మండలంలో పోచాపుర్‌లో, వాజేడు మండలంలోని ఏడ్చర్లపల్లిలో నిర్మించినట్టు చెప్పారు. ఐటీడీఏ ఏటూరునాగారం అధికారులు సోలార్‌ ప్యానెల్లు ఏర్పాటు చేశారనీ, అక్కడ ఆదివాసీ గిరిజనులు ఉదయం తమ మొబైళ్లను చార్జింగ్‌ పెట్టుకుని..రాత్రి టార్చిలైట్లుగా వినియోగించుకుంటున్న పరిస్థితిని వివరించారు. మంచినీటి బోర్లు కూడా వేయనీయడం లేదని సీతక్క కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పట్టణాల్లో స్కై వే, హై వేలు వస్తుంటే..ఆదివాసీ గూడాల్లో కనీసం మట్టి రోడ్లు రాకపోతే సమాజంలో ఉన్న అంతరాలు ఎప్పుడు పోతాయని ఆమె ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులకు అనుమతిలిచ్చినట్టుగానే అంతే వేగంగా అడవి బిడ్డల సదుపాయాలకు అనుమతులివ్వాలని ఆమె కోరారు. ఆదిలాబాద్‌లోని ఒక గ్రామానికి అటవీ ప్రాంతం గుండా రోడ్డు వేసేందుకు రూ.9 కోట్లు ఖర్చవుతుందని ఇంజినీర్లు అంచనా వేశారనీ, ఆ రోడ్డు వేసేందుకు రూ.76 కోట్లు పెనాల్టీ కట్టాలని అటవీ శాఖ చెబుతున్న ఇబ్బందిని ఆమె వివరించారు. ప్రతి చోటా ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పారు.
10 రోజుల్లో అటవీ అధికారులతో సమావేశం : కేంద్ర గిరిజన సంక్షేమశాఖ అడిషనల్‌ సెక్రెటరీ మనీష్‌ ఠాకూర్‌, డైరెక్టర్‌ సమీదా సింగ్‌
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో 10 రోజుల్లో ఢిల్లీలో ఆయా రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్‌ సెక్రెటరీ మనీష్‌ ఠాకూర్‌, డైరెక్టర్‌ సమీదా సింగ్‌ హామీ ఇచ్చారు. అంతకుముందు వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయా రాష్ట్రాల ప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ, పర్యావరణ శాఖల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనల సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గిరిజన ప్రభావిత ప్రాంతాల్లో తాను కలెక్టర్‌గా చేసినప్పటి అనుభవాలను వారితో పంచుకున్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ.శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -