నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ అర్జెంటీనా పుట్ బాల్ ప్లేయర్ మెస్సీ అభిమానులకు సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు.మెస్సీ పర్యటన సమయంలో ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
సాల్ట్లేక్ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లియోనల్ మెస్సీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలోని సీట్లు ధ్వంసం చేసి.. గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లను ఫ్యాన్స్ విసిరేశారు. అలాగే, బారికేడ్లు దాటుకొని మైదానంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అభిమానులు గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్ బయటకు వెళ్లిపోయింది. ఇక, స్టేడియంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.



