నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం అతిషి మండిపడ్డారు. అర్హులకు ఇండ్లు ఇవ్వకుండా..అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపడం సీఎం రేఖాగుప్తాకే చెల్లిందన్నారు. ఎన్నికల హామీలను తుంగలోతొక్కి ఢిల్లీ వాసులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. పేదలను ఇండ్ల నుంచి బలవంతంగా పంపించి వేస్తున్నారని, వారి తరుపున పోరాడిన ఆప్ నేతలను జైలో వేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు,CRPF, ఇతర బలగాలు పేద ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నాయని ఆరోపించారు.
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) జూన్ 11న కల్కాజీలోని భూమిహీన్ క్యాంప్ ప్రాంతంలో వెలిసిన గుడిసెలను కూల్చివేసింది. రేఖాగుప్తా చర్యలను ఖండిస్తూ..ఆప్ శ్రేణులతో కలిసి అతిషి నిరసన వ్యక్తం చేశారు. భారీగా పార్టీ శ్రేణులతో కలిసి భూమిహీన్ చేరుకొని ప్రభుత్వ చర్యలను అడ్డుకున్నారు. దీంతో వెంటనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ అతిషిని విడుదల చేయగా.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ చర్యలపై నిప్పులు చెరిగారు. ఏండ్ల తరబడి ఉంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించి, వారిని నిరాశ్రయులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పుతారన్నారు.